మృతుల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ – ముషీరాబాద్
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బస్సు ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన వారి కుటుంబాన్ని గురువారం హైదరాబాద్లోని విద్యానగర్లో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌదీ దుర్ఘటనలో నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది మరణించడం అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎటువంటి ఆర్థిక, సామాజిక సహాయం అవసరమైనా పార్టీ ద్వారా అందజేస్తామని బాధితులకు చెప్పారు. అలాగే, బాధిత కుటుంబ సభ్యులతో సౌదీకి వెళ్లిన బీఆర్ఎస్ బృందం.. అక్కడ వారికి అవసరమైన సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, పల్లా రాజేశ్వర్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి మహమ్మద్ అలీ ఉన్నారు.



