నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజిల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ప్రైవేట్ కాలేజీల్లో 2025-26గానూ ఉన్నత విద్యామండలి ఈ షెడ్యూల్ విడుదల చేయగా.. జూలై 19నుంచి ఈ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అగస్టు 10 వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. ఎప్సెట్, సీసీబీ, జోసా షెడ్యూల్కు అనుగుణంగా దీనిని రూపొందించారు. అప్లికేషన్లతో పాటు ఇతర వివరాల కోసం అధికార వెబ్సైట్ https://tgche.ac.in/ ను సంప్రదించాలని ఉన్నత విద్యామండలి సూచించింది.
దరఖాస్తు ఆన్లైన్ ద్వారా లేదా నేరుగా కళాశాలలో సమర్పించవచ్చు. అభ్యర్థులు కళాశాల మేనేజ్మెంట్ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ లేదా పేమెంట్ గేట్వే ద్వారా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కళాశాలలకు దరఖాస్తు చేయాలనుకుంటే, ప్రతి కళాశాలకు ప్రత్యేకంగా దరఖాస్తు, రుసుము చెల్లించాలి. అర్హత పరీక్షలో 50% మార్కులు లేదా 10 పాయింట్ల స్కేల్పై 5 CGPA సాధించిన NRI లేదా NRI స్పాన్సర్డ్ అభ్యర్థులను భర్తీ చేయవచ్చు. వీరికి సీట్లలో 15% వరకు అవకాశం కల్పించారు. ఎన్ఆర్ఐ కోటాలో ఖాళీగా ఉన్న సీట్లను JEE (మెయిన్స్) ఆల్ ఇండియా ర్యాంక్ పొందిన అభ్యర్థులతో భర్తీ చేయాలి. వీరు అర్హత పరీక్షలో 45% కంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలి. పైన పేర్కొన్న కేటగిరీల తర్వాత మిగిలిన సీట్లను TGEAPCET-2025లో అర్హత సాధించిన అభ్యర్థులతో మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. ఇంకా సీట్లు ఖాళీగా ఉంటే, అర్హత పరీక్షలో 45% (రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు 40%) మార్కులు సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయాలి.