ప్రభుత్వ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈనెల పదో తేదీ నుంచి సంక్రాంతి పండుగ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుంటాయని తెలిపారు. ఈనెల 17న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు అంటే ఐదు రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనెల 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉన్నది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. అకడమిక్ క్యాలెండర్లో ఉన్నట్టుగా కాకుండా సంక్రాంతి సెలవులను మార్చాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. ఈనెల 16న కనుమ పండుగ ఉన్నందున అదే రోజు వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించడం గమనార్హం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు ఈనెల 11 నుంచి 18 వరకు ఎనిమిది రోజులపాటు సంక్రాంతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 19న జూనియర్ కాలేజీలు పున:ప్రారంభమవుతాయి.



