Tuesday, June 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

– హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
– శంషాబాద్‌ మండలం పెద్ద షాపూర్‌ వద్ద ఘటన
– కందుకూరు వద్ద మరో ప్రమాదంలో యువకుడు మృతి
నవతెలంగాణ-శంషాబాద్‌, కందుకూరు

రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన లారీని పక్కకు తప్పిస్తూ.. ట్రాఫిక్‌ సరిదిద్దుతున్న సమయంలో అక్కడికి వేగంగా వచ్చిన మరో లారీ పోలీసులను ఢకొీట్టింది. ఈ ఘటనలో ఒక పోలీసు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులే రోడ్డు ప్రమాదంలో మరణించడం కలకలం రేపింది. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కె.నరేందర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 9 గంటల 48 నిమిషాలకు బెంగళూరు జాతీయ రహదారి – 44 పెద్ద షాపూర్‌ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని పెట్రోలింగ్‌ మొబైల్‌-1 నుంచి 100 డయల్‌కు కాల్‌ వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక పెట్రోలింగ్‌ మొబైల్‌-1 సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్స్‌ డి.విజరుకుమార్‌ (40), డి.చెన్నయ్య అక్కడికి చేరుకున్నారు. వీరితోపాటు హైవే ట్రాఫిక్‌ మొబైల్‌-2 సిబ్బంది యాదయ్య డ్రైవర్‌ ఇ.శ్రీనివాస్‌ కూడా అక్కడ ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ కోసం వచ్చారు. ముందుగా ప్రమాదానికి గురైన లారీని పక్కకు తప్పించి ట్రాఫిక్‌ సరిదిద్దుతున్న సమయంలో రాత్రి 10 :45 గంటలకు కర్నాటక నుంచి వస్తున్న ఒక లారీ (డ్రైవర్‌ రమేష్‌ కాంబ్లే) అతివేగంగా, అజాగ్రతగా రావడంతో ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ విజరుకుమార్‌తో పాటు సిబ్బంది యాదయ్య, డ్రైవర్‌ శ్రీనివాస్‌ను ఢ కొట్టింది. ఈ ఘటనలో విజరుకుమార్‌ అక్కడికక్కడే మృతిచెందగా, యాదయ్య, శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విజరుకుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిని నగరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదంలో యువకుడు మృతి
కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కందుకూరు సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం బేగం పేట గ్రామం గాజుల బురుజు తండాకు చెందిన రామావత్‌ సింగ్‌ (24) శనివారం సాయంత్రం తన బైక్‌పై కూరగాయలు తీసుకురావడానికి బేగంపేట గ్రామానికి వచ్చాడు. కూరగాయలు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో అతివేగంతో వచ్చిన లారీ బైక్‌ను ఢకొీట్టింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెట్రోలింగ్‌ పోలీసులను ఢ కొట్టిన లారీ
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ విజరుకుమార్‌ అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. షాబాద్‌ మండల పరిధిలోని కుర్వగూడ గ్రామంకు చెందిన విజరుకుమార్‌.. శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న శంషాబాద్‌ జోన్‌ డీసీపీ రాజేష్‌, ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్‌, సీఐ నరేందర్‌రెడ్డి.. మృతుని స్వగ్రామం కుర్వగూడలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -