– అవి తెలంగాణ రైజింగ్కు అనుగుణంగా ఉండాలి : సీఎస్ కె.రామకృష్ణారావు ొ ప్రభుత్వ విభాగాధిపతులతో భేటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రైజింగ్ – 2047 కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు లక్ష్యాలను నిర్ధేశించు కోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు ఉన్నతాధికారులను అదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం వ్యవసాయం, సహకార, పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, ఆహార, పౌర సరఫరాలు, కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, జీఏడీ సర్వీసులు శాఖలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. వ్యవసాయశాఖ రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. భవిష్యత్లో యూరియా, ఎరువుల పంపిణీని ఐటీ ఆధారిత సేవల ద్వారా పటిష్టంగా పంపిణీ చేయాలని సూచించారు.
పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్యశాఖలపై సమీక్ష
పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్యశాఖలపై సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పశుసంవర్ధక రంగం అభివద్ధికి తీసుకుంటున్న చర్యలు, డెయిరీ రంగంలో ఉత్పత్తి పెంపు, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడంపై చేపట్టిన కార్యక్రమాలు, మత్స్యశాఖ ద్వారా మత్స్యకారుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల పురోగతిని ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. పశువైద్య సేవలను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలనీ, పశుఆరోగ్య శిబిరాల నిర్వహణను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పశువుల వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలనీ, టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని ఆదేశించారు. డెయిరీ అభివద్ధి అంశంలో పాలసేకరణ, శీతలీకరణ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాలనీ, చిన్న, సన్నకారు పాడి రైతులకు లాభదాయకంగా ఉండే విధంగా విధానాలు రూపొందించాలని పేర్కొన్నారు. సహకార డెయిరీ సంస్థల పనితీరును మెరుగు పరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మత్స్యశాఖ సమీక్షలో చేపల ఉత్పత్తి పెంపు, చెరువులు, కుంటలు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, మిడ్మానేరు, పాలేరు తదితర జలాశయాల్లో చేపల పెంపకంపై కార్యాచరణ రూపొందించుకో వాలని సూచించారు. మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మత్స్యకారుల సంక్షేమ పథకాలు సమయానికి లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు.
పర్యావరణం, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి
ఈ శాఖల్లో అమలు చేస్తున్న పథకాలు, పురోగతి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై సీఎస్ మాట్లాడుతూ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు, జీవ వైవిధ్య సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం తగ్గింపు దిశగా చేపడుతున్న చర్యలపై అధికారులు సీఎస్కు వివరించారు. అటవీశాఖ పరిధిలో అటవీ సంరక్షణ, అటవీ ఆధారిత జీవనోపాధి కార్యక్రమాలు, అటవీ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ-గవర్నెన్స్, తెలంగాణ విజన్ 2047, పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టుల వేగవంతం, శాఖల మధ్య సమన్వయం పెంచుకుని ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత కాలంలో సాధించాలని తెలిపారు. కవ్వాల్, అమ్రాబాద్, టైగర్ రిజ్వర్వ్ ప్రాంతాల సమస్యలపై సమీక్షించారు. కంపా నిధుల విని యోగం, హరిత నిధి, ఎకో టూరిజం, గ్రీన్ కవర్, ట్రెక్పార్క్లో, అర్బన్ పార్కులు తదితరాంశాలపై అధికారులతో సమీక్షించారు.
పౌర సరఫరాల శాఖ
పౌర సరఫరాల శాఖపై సీఎస్ సమీక్షిస్తూ ఈ శాఖ పరిధిలో అమలవుతున్న వివిధ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలు, సరఫరా వ్యవస్థ పనితీరు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చిం చారు. ప్రధానంగా ప్రజా పంపిణీ వ్యవస్థ, లబ్ధిదారులకు సన్న బియ్యం, గోదాముల్లో నిల్వలు, రేషన్ దుకాణాల పనితీరు, ఈ-పాస్ యంత్రాల వినియోగం, ఆహార భద్రత చట్టం అమలు, రేషన్ కార్డులజారీ అంశాలపై అధికారులనడిగి తెలుసుకున్నారు.
కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ
కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల పురోగతి, కార్మికుల సంక్షేమం సంబంధించిన పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థ వంతంగా అమలు చేయాలనీ, ఉపాధి కల్పన లక్ష్యంగా చేపడుతున్న శిక్షణ కార్యక్రమాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండాలనీ, యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏటీసీ, టామ్కామ్, ఐటీఐలు, కృషి విజ్ఞాన కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరచాలనీ, ప్రయివేటు రంగంతో సమన్వయం పెంచాలని అన్నారు. యువతకు గ్రేడింగ్ స్కిల్స్ కార్యక్రమాలు నిర్వహించి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ, నర్సింగ్ కోర్సుల ద్వారా యువతకు విదేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ సూచించారు.
సాధారణ పరిపాలన శాఖ
రాజ్యాంగ బద్ధమైన సంస్థల స్థితిగతులు, పెండింగ్ డిసిప్లినరీ కేసులు, కార్యాలయాల లభ్యత, జనగణన, పెండింగ్ ఆడిట్ వివరాలు, పరిపాలన సంబంధమైన తదితర విషయా లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దానకిషోర్, బీఎండీ ఎక్కా, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ సువర్ణ, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తీ, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, మత్స్యశాఖ కమిషనర్ నిఖిల, హార్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, డైరెక్టర్ సెన్సెస్ భారతీ హోళికేరి, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయం
వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హార్టికల్చర్ శాఖల్లో అమలవుతున్న పథకాలపై ఆరాతీశారు. ఆయిల్పామ్ ప్లాంటేషన్, ప్రజల అవసరాల మేరకు పండ్లు, కూరగాయల పెంపకాన్ని విస్త్రృతంగా ప్రోత్సహించాలని సీఎస్ చెప్పారు. ప్రభుత్వం హైబ్రిడ్ మోడ్లో భాగంగా చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోహెడ మార్కెట్ నిర్మాణ పనులపై సమీక్ష చేశారు. అదే విధంగా రాష్ట్రంలో రైతుల సంక్షేమం, పంటల దిగుబడి, రైతు సమస్యల పట్ల వ్యవసాయ శాఖ నిరంతర పర్యవేక్షణ చేయాలని డిజిటల్ క్రాప్ సర్వే కూడా నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ప్రస్తుత స్థితిగతులు, రైతులకు అందుతున్న సేవలు, సాగునీటి లభ్యత, విత్తనాలు-ఎరువుల సరఫరా, పంటల దిగుబడి, అలాగే సహకార శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. రాబోయే సాగు కాలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు తగినంతగా అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా స్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సహకార సంఘాల పనితీరు, రైతు సహకార సంఘాల ఆర్థిక స్థితి, రుణాల పంపిణీపై సమీక్ష చేశారు. సహకార సంఘాలను మరింత పటిష్టం చేసి రైతులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.



