రేణుక సింగ్ పునరాగమనం
వన్డే వరల్డ్కప్కు భారత మహిళల జట్టు
ఐసీసీ మహిళల ప్రపంచకప్ వేటలో రెండు సార్లు ఫైనల్లో తడబాటుకు గురైన టీమ్ ఇండియా.. 2025లో టైటిల్ కల సాకారం చేసుకోవాలనే తపనతో కనిపిస్తోంది. ఇటీవల ఉత్తమ ప్రదర్శనతో రాణిస్తున్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. పెద్దగా మార్పులు చేర్పులకు తావులేకుండా ఇప్పటివరకు రాణించిన వారిపైనే విశ్వాసం నిలిపింది. 2025 ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్కు భారత జట్టు గెలుపు గుర్రాలను మంగళవారం ప్రకటించింది.
నవతెలంగాణ – ముంబయి
ఐసీసీ మహిళల 2025 వన్డే వరల్డ్కప్ భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. యువ ఓపెనర్, ధనాధన్ హిట్టర్ షెఫాలీ వర్మకు సెలక్షన్ కమిటీ మొండిచేయి అందించింది. డబ్ల్యూపీఎల్ 2025 సహా ఇటీవల భారత్-ఏ తరఫున ఆసీస్లో నిలకడగా రాణించిన షెఫాలీ వర్మ సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్మెంట్ నమ్మకాన్ని పొందలేకపోయింది. షెఫాలీ వర్మ లేని వేళ టీమ్ ఇండియాకు వన్డేలో రాణించిన యువ ఓపెనర్ ప్రతిక రావల్తోనే సెలక్షన్ కమిటీ ముందుకెళ్లింది. 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆల్ ఇండియా మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మతీ మంధాన, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాలు చీఫ్ సెలక్టర్ నీతూ డెవిడ్ అధ్యక్షతన జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి భారత్ వేదికగా ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
ఆ ఇద్దరు ఇన్
ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేసర్ రేణుక సింగ్ ఠాకూర్, ఆల్రౌండర్ ఆమన్జోత్ కౌర్కు భారత ప్రపంచకప్ జట్టులో చోటు లభించింది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ ఇటీవల ఫామ్ చాటుకున్నా.. ఆమెకు నిరాశ తప్పలేదు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మతీ మంధానకు తోడు ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రొడ్రిగస్ బ్యాటింగ్ లైనప్లో నిలిచారు. రిచా ఘోష్, యస్టికా భాటియాలు వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. బౌలింగ్ విభాగంలో హైదరాబాదీ అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, రాధ యాదవ్, శ్రీ చరణి, స్నేV్ా రానాలు నిలిచారు.
ఆసీస్తో సిరీస్కు ఒక్క మార్పు
సెప్టెంబర్ 14-20న భారత్, ఆస్ట్రేలియా అమ్మాయిలు మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనున్నారు. తొలి రెండు వన్డేలు న్యూ చంఢగీడ్ (ముల్లాన్పూర్)లో జరుగనుండగా.. ఆఖరు వన్డే న్యూఢిల్లీలో షెడ్యూల్ చేశారు. మహిళల ప్రపంచకప్ ముంగిట హర్మన్ప్రీత్ సేన ఈ సిరీస్ను సన్నాహకంగా భావిస్తోంది. ఆల్రౌండర్ ఆమన్జోత్ కౌర్ బెంగళూర్లోని సీఓఈలో ఫిట్నెస్ మెరుగుపర్చుకుంటోంది. దీంతో ఆసీస్తో సిరీస్లో ఆమన్జోత్ కౌర్ ఆడటం లేదు. ఆమె స్థానంలో సయాలి ఆసీస్తో సిరీస్లో ఆడనుంది. ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో ఆమన్జోత్ కౌర్ బరిలోకి దిగుతుంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్కు భారత మహిళల జట్టు
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మతీ మంధాన (వైస్ కెప్టెన్), ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రొడ్రిగస్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రేణుక సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, ఆమన్జోత్ కౌర్, రాధ యాదవ్, యస్టికా భాటియా (వికెట్ కీపర్), శ్రీ చరణి, స్నేV్ా రానా.
స్టాండ్ బైలు : తేజల్, ప్రేమ రావత్, ప్రియ మిశ్రా, ఉమ ఛెత్రి, మిన్ను మణి, సయాలి.