మద్దికుంట ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్పి
కిటకిటలాడిన ఆలయాలు
అన్నదాన కార్యక్రమాలు
నవతెలంగాణ – రామారెడ్డి
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని మద్దికుంట లో వెలసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి, పోసానిపేట శ్రీ రాజరాజేశ్వర స్వామి, అన్నారం, ఉప్పల్ వాయి తోపాటు గొల్లపల్లి శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. మద్దికుంట ఆలయంలో ఉదయం నాలుగు గంటల నుండి భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్వామివారి రథోత్సవంలో ఎస్పి రాజేష్ చంద్ర, ఏ ఎస్ పి చైతన్య రెడ్డి పాల్గొని ప్రారంభించారు. కామారెడ్డి పాత బస్టాండ్ నుండి మద్దికుంట ఆలయం వరకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడిపింది. స్వామివారి రథోత్సవం కన్నుల విందుగా నిర్వహించారు. రాత్రి బండి రాములు యోగ కార్యక్రమం తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రధాన పూజారి ప్రభాకర్ స్వామి, మాజీ ప్రజా ప్రతినిధులు నా రెడ్డి మోహన్ రెడ్డి, నర్సింగరావు, చంద్రశేఖర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



