– 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ
– ప్రతిపక్షాల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోని ఈసీ
– సుప్రీంలో ‘సర్’ కేసు పెండింగ్
న్యూఢిల్లీ : స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) మంగళవారం ప్రారంభించింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ దశకు అనుమతించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లను సర్ కవర్ చేయనున్నది. వీటిలో, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి 2026లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ఏడాది బీహార్లో సర్ ప్రక్రియ చేపట్టి.. 68 లక్షలకు పైగా పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించింది.
ప్రక్రియ ఇలా..
ఇంటింటికి వెళ్లి గణన ప్రక్రియ మంగళవారం నుంచి డిసెంబర్ 4 వరకు జరుగుతుంది. డిసెంబర్ 9న ఈసీఐ ముసాయిదా జాబితాలను ప్రచురించనున్నది. ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు వాదనలు, అభ్యంతరాలను సమర్పించవచ్చు. దానికనుగుణంగా నోటీసులు జారీ చేయబడతాయి. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు విచారణలు, ధ్రువీకరణలు జరుగుతాయి. తుది ఓటర్ల జాబితాలు ఫిబ్రవరి 7న ప్రచురించనున్నట్టు ఈసీ ప్రకటించింది.
ప్రతిపక్షాల అభ్యంతరం
మోడీ సర్కార్ ఆదేశించినట్టుగానే.. ఈసీఐ వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా సర్ కేసు పెండింగ్లో ఉన్నది. తీర్పు వచ్చే వరకు ఆగకుండా బుల్డోజ్ రాజకీయాన్ని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. తాజాగా డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా సుప్రీంలో సర్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసు విషయంలో తీర్పు వచ్చాకే సర్ను అమలుచేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. వీటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఓట్లు తోలగించేలా మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
సర్ ప్రక్రియ షురూ
- Advertisement -
- Advertisement -



