Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపట్టు బిగిస్తున్న సిట్‌

పట్టు బిగిస్తున్న సిట్‌

- Advertisement -

పకడ్బందీగా వ్యవహారం
– ఇప్పటి వరకు 200కు పైగా స్టేట్‌మెంట్లు రికార్డు
– త్వరలో మరికొందరు ప్రముఖుల సాక్ష్యం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో నిందితులపై ఉచ్చు బిగించటానికి జూబ్లిహిల్స్‌ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం రోజురోజుకూ పట్టు బిగిస్తున్నది. కేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 200కు పైగా బాధితుల సాక్ష్యాలను నమోదు చేసిన స్పెషల్‌ టీం అధికారులు మరికొందరు ప్రముఖుల సాక్ష్యాలను కూడా సేకరించబోతున్నదని తెలిసింది. గతేడాది మార్చి నెలలో వెలుగు చూసిన ఈ కేసులో ఇప్పటి వరకు ఫోన్‌ట్యాపింగ్‌లకు కారకులంటూ నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, బుజంగారావు, తిరుపతన్నలను సిట్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నలుగురు కూడా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. కాగా, మరో ఇద్దరు నిందితులు ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు, ఐన్యూస్‌ సీఈఓ శ్రవణ్‌రావులు కోర్టు అనుమతితో అరెస్ట్‌ కానప్పటికీ.. వీరిద్దరిని కూడా సిట్‌ అధికారులు పలు మార్లు పిలిచి విచారించారు. ఇందులో ప్రభాకర్‌రావు విచారణ ఇంకా విడతలవారీగా కొనసాగింపు దశలోనే ఉన్నది.
పలువురు ప్రముఖుల వాంగ్మూలాలు నమోదు
దాదాపు 4వేలకు పైగా ఫోన్లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌ చేసినట్టుగా సిట్‌ ఇప్పటి వరకు గుర్తించింది. ఇందులో 600 వరకు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ప్రముఖ వ్యాపారులు, సెలెబ్రెటీలు కూడా ఉన్నట్టు సిట్‌కు సమాచారం ఉన్నది. అంతేగాక, త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డితో పాటు మరికొందరు జడ్జిల ఫోన్‌నెంబర్లను కూడా ట్యాపింగ్‌ చేసినట్టు సిట్‌ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, బీజేపీ ఎంపీలు ఈటల కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు నాయకులు సిట్‌కు వచ్చి తమ ఫోన్‌కాల్స్‌ ట్యాపింగ్‌కు గురైనట్టు వాంగ్మూలాలు ఇచ్చారు. ఈ ట్యాపింగ్‌ వ్యవహారంలో అప్పటి పోలీసు ఉన్నతాధికారులు, ప్రస్తుత డీజీపీ జితేందర్‌, అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రస్తుత ఎస్పీఎఫ్‌ డీజీ అనిల్‌ కుమార్‌ల స్టేట్‌మెంట్లను కూడా సిట్‌ అధికారులు రికార్డు చేశారు. త్వరలో కేంద్ర మంత్రి బండి సంజరు వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయ టానికి సిట్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.
సునిశితంగా పరిశీలిస్తున్న సిట్‌
సాక్షుల వాంగ్మూలాలను సునిశితంగా పరిశీలిస్తున్న సిట్‌ అధికారులు అందులో నుంచి సశాస్త్రీయ ఆధారాలను విశ్లేషించి వాటిని రికార్డు చేస్తున్నట్టు సమా చారం. సంఘ విద్రోహశక్తుల కార్యకలాపాలను కనిపెట్టటానికి ఉపయోగించే ఫోన్‌ట్యాపింగ్‌ అస్త్రాన్ని చట్టపరిధిలో నడుచుకునే ప్రముఖులు, వ్యాపారులు, జడ్జిల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతలను హరిస్తూ వారి ఫోన్లను ట్యాపింగ్‌ చేయటం అత్యంత దుర్మార్గమైన చర్య అని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందుకు పాల్పడ్డ వారు ఎంతటివారినైనా వదలరాదని వారు డిమాండ్‌ చేస్తు న్నారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న సిట్‌ అధికారులు సైతం తమ దర్యాప్తును కట్టుదిట్టంగా నిర్వహించి, పకడ్బందీగా సాక్ష్యాలను సశాస్త్రీయంగా సేకరించి నిందితులను కోర్టులో నిలబెట్టాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనికి మరికొంత కాలం సమయం పట్టినా తీసుకుంటూ కచ్చితమైన ఫలితాన్ని సాధించాలని లక్ష్యంగా పని చేస్తున్నట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -