ఈడీ చార్జిషీట్కు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో ఐదుగురిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)దాఖలు చేసిన చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే, ఈ కేసులో ఈడీ తమ దర్యాప్తును కొనసాగించొచ్చని న్యాయస్థానం తెలిపింది. ప్రయివేటు వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తు జరిపి ఈ చార్జిషీట్ను దాఖలు చేసినట్టు న్యాయస్థానం విచారణ సందర్భంగా వెల్లడించింది. చట్టప్రకారం దీన్ని పరిగణనలోకి తీసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అలాంటప్పుడు ఈడీ చార్జిషీట్ ఆధారంగా తీర్పు ఇవ్వడం తొందరపాటు చర్యే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
నేషనల్ హెరాల్డ్ మాతృక సంస్థ అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే, ఈ వ్యవహారంలో సోనియా, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ ప్రయివేటు కంపెనీ కుట్ర, మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. రాహుల్, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియన్ కేవలం రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందిందని దర్యాప్తు సంస్థ తమ చార్జిషీట్లో పేర్కొంది. మోతీలాల్ వోరా 2020లో మృతి చెందగా.. ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో మరణించారు.



