నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఎంపీడీఓలు,హౌసింగ్ అధికారులు, మునిసిపల్ కమీషనర్ లతో పనుల పురోగతిపై మండలాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6,200 మందికి మంజూరు ఉత్తర్వులు అందించడం జరిగిందని, ఇప్పటి వరకు చాలా మంది లబ్ధిదారులు మార్కౌట్ చేసుకోలేదన్నారు.
వివిధ కారణాల వల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్దిదారులకు ఇళ్లను మంజూరు చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల ఆఫ్ లో అట్టి వారి వివరాలను నమోదు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ రాకముందే మర్కౌట్ చేసుకున్నట్లయితే అట్టి పనులకు కోడ్ వర్తించదని తెలుపుతూ.. ప్రస్తుతం వర్షాలు కూడా తగ్గు ముఖం పట్టాయని, అవసరమైన ఇసుక కూడా అందుబాటులోకి వచ్చినందున రెండు రోజులలో మార్క్ అవుట్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన పూర్తి వివరాలను ఇందిరమ్మ ఇండ్ల పురోగతి ఆప్ లో నమోదు చేయాలన్నారు. ఆప్ లో నమోదు చేసే పద్ధతిని కలెక్టర్ స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అన్ని గ్రామపంచాయతీ లలో గ్రామ కార్యదర్శులతో, మున్సిపాలిటీలలో వార్డ్ ఆఫీసర్ లతో పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నరసింగరావు, హౌజింగ్ పిడి శ్రీనివాస్ రావు, డిపిఓ నగేంద్రం, అన్ని మండలాల ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES