పోలవరం – బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పోలవరం- బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లకుండా నిలువరించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినట్టు లేఖలో గుర్తు చేశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే, నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల లింకు ప్రాజెక్టు చేపట్టకుండా అడ్డుకోవాలని కోరారు. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు సైతం లేఖ రాసింది. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. పోలవరం-బనకచర్ల విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా నిలువరించడంతో పాటు టెండర్, భూసేకరణ విషయంలోనూ ముందుకెళ్లకుండా చూడాలని కోరారు.