నవతెలంగాణ – పెద్దవూర
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా చైల్డ్ ప్రోటక్షణ్ అధికారి మహేష్అనుముల ఐసీడీఎస్ సూపర్ వైజర్ శశికళ అన్నారు. గురువారం మండలంలోని శిరసన గండ్ల, కొత్తలూరు, పెద్దగూడెంలో గ్రామ లెవల్ పిల్లల సంరక్షణ కమిటీ స్థానిక సర్పంచిల ఆధ్వర్యంలో గ్రామస్తులకు బాల్య వివాహాలు, అక్రమ దత్తత, బాల కార్మిక నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మాయిలు 18 సంవత్సరాలు వచ్చాక మాత్రమే వివాహం చేసుకోవాలన్నారు.
చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల వారికి పుట్టే పిల్లల్లో జన్యు పరమైన సమస్యలు ఉత్పన్నమౌతాయన్నారు. బాలికలకు యుక్త వయస్సు వచ్చిన వెంటనే వివాహాలు చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకుంటున్నారని అదిచట్టరీత్యా నేరం అని తెలిపారు.బాల్య వివాహాల వల్ల భవిష్యత్లో అనేక కుటుంబ సమస్యలతో పాటు ఆరోగ్య, మానసిక సమస్యలను ఎదుర్కొంటారన్నారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
పిల్లల దత్తత చాలా సులభం అని, ప్రభుత్వమే ఆ అవకాశం కల్పించినందున ప్రతి ఒక్కరు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దత్తత తీసుకోవాలని, తెలిపారు. బడి ఈడు పిల్లలను పనిలోకి పంపించినా వారిపై చట్ట పరమైన శిక్షలు విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచిలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సభ్యులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పోలీస్ అధికారి లోకేష్ రెడ్డి, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



