– సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎస్సీ,ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
– విద్యార్థి మృతి కారకులపై కఠిన చర్యలు తప్పువు
– పూర్తి స్థాయి విచారణకు ఆదేశం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థి వివేక్ అనుమాన స్పదంగా మృతి చెందడం చాలా బాధాకరమని ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం హుస్నాబాద్ మండలంలోని జిల్లెల్లగడ్డ గ్రామ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు.
ఈ నెల 7 వ తేదీన పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ ఘటన పై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో వంటగదిని పరిశీలించారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు విద్యార్థి వివేక్ మృతి చాలా బాధాకరమని, విద్యార్థి మృతి పై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపి, కలెక్టర్ ను ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఎంక్వైరీ ఆఫీసర్ గా ఎస్సి కార్పొరేషన్ ఈడివిజయ్ భాస్కర్ ను నియమిస్తామని కలెక్టర్ చెప్పారని వెల్లడించారు.
విద్యార్థి మృతి పై హుస్నాబాద్ ఏసిపి ఇచ్చే రిపోర్ట్, పోస్టుమార్టం రిపోర్ట్, ఎంక్వయిరీ ఆఫీసర్ విజయభాస్కర్ ఇచ్చే రిపోర్ట్ ల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 12 మంది సహచర విద్యార్థులు, ఉపాధ్యాయున్ని కూడా విచారణ చేశామన్నారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతోపాటు ఆర్డిఓ రామ్మూర్తి, జాతీయ మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ ఎలుక దేవయ్య, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆరె కిశోర్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంజనేయులు, మీడియా సెల్ ఇంచార్జ్ జాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.