నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం మరియు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని గురువారం ఆమె మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మేకల అభినవ్ స్టేడియం వరకు నిర్వహించిన “జాతీయ క్రీడా దినోత్సవ రన్ ను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక, శారీరక దారుఢ్యం పెంపొందుతాయని, అంతేకాక క్రీడలతో ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని, చురుకుగా పనిచేసేందుకు క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు.
అలాంటి క్రీడల పట్ల జిల్లాలోని విద్యార్థులందరూ ఆసక్తి కనపరచాలని, క్రీడల్లో మంచి ప్రతిభను చూపించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మమ్మద్ అక్బర్ అలీ, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, డిపిఓ వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు క్రీడాజ్యోతిని వెలిగించారు.