Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంలొంగిపోండి

లొంగిపోండి

- Advertisement -

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో
ప్రభాకర్‌రావుకు సుప్రీం ఆదేశం
ఇంటి ఆహారం, మెడిసిన్‌కు అనుమతి..తదుపరి విచారణ 19కి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు కస్టడీ విచారణను సుప్రీంకోర్టు అనుమతించింది. నేడు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌) ఆఫీసర్‌ పి. వెంకట గిరి(ఏసీపీ) ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే కస్టడీ సమయంలో ప్రభాకర్‌ రావుపై ఫిజికల్‌ టార్చర్‌ చేయకుండా విచారణ చేయాలని సూచించింది. అలాగే మందులు, ఇంటి నుంచి భోజనానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్‌ ప్రయోజనాలను, అదే సమయంలో విచారణను సమతుల్యం చేయడానికి తాము ప్రయత్నిస్తున్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేయమని, విచారణ ముగించకుండా అలాగే హౌల్డ్‌లో ఉంచుతామని పేర్కొంది. గురువారం ఈ పిటిషన్‌ పై జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జి) తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూత్రా, ప్రభాకర్‌ రావు తరపున న్యాయవాది రంజిత్‌ కుమార్‌లు వాదనలు వినిపించారు.

జడ్జీలు ఎల్‌డబ్ల్యూడీ కేటగిరి కిందకు వస్తారా…?
తొలుత పిటిషనర్‌ తరపు రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పూర్తిగా కట్టు కథ అని ఆరోపించారు. పొలిటికల్‌ కక్ష సాధింపులో భాగంగా ప్రభాకర్‌ రావును ఇందులో ఇరికించారన్నారు. ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5, ఏ6లుగా ఉన్న… ప్రణీత్‌ రావు, భుజంగ రావు, మేకల తిరుపతన్న, రాధాకిషన్‌ రావు, శ్రవణ్‌ కుమార్‌గా చేర్చినట్టు చెప్పారు. వీరిలో శ్రవణ్‌కుమార్‌ సుప్రీంకోర్టు నుంచి ముందుస్తు బెయిల్‌, మిగిలిన అధికారులు హైకోర్టు, ట్రయల్‌ కోర్టుల నుంచి బెయిల్‌ పొందినట్టు తెలిపారు. ఎస్‌ఐబీ చీఫ్‌గా కేవలం వామ పక్ష తీవ్రవాదం(ఎల్‌ డబ్ల్యూఈ) కు సంబంధించిన సమాచారాన్ని రికార్డు చేయడం వీరి బాధ్యతని అన్నారు. ఇందుకు సంబంధించి టెలికం చట్టాలు, టెలిగ్రాఫ్‌ రూల్‌ 17, ఐటీ రూల్‌ 22 లు ఉన్నాయన్నారు. మధ్యలో తుషార్‌ మెహతా జోక్యం చేసుకొని జడ్జీలు కూడా ఎల్‌డబ్ల్యూడీ కేటగిరిలోకి వస్తారా? అని ప్రశ్నించారు. ఇందుకు రంజిత్‌ కుమార్‌ స్పందిస్తూ… అసలు జడ్జీల ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది పూర్తిగా అవాస్తవం అని కోర్టుకు నివేదించారు. దీనిపై కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అన్ని అంశాలను పొందుపరిచినట్టు చెప్పారు. మరోవైపు చీఫ్‌ సెక్రెటరీ నేతృత్వంలోని జీఏడీ సెక్రెటరీ, లా సెక్రెటరీతో కూడిన ఎఫెక్స్‌ బాడీ ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎల్‌డబ్ల్యూడీ విధానాన్ని మానిటరింగ్‌ చేస్తుందన్నారు. 27.9.23 నుంచి 30.11.2023లో ఈ కమిటీ చేసిన రివ్యూలో… పూర్తిగా లీగల్‌ ఆథరైజేషన్‌గానే దేశ వ్యతిరేక, ఎల్‌డబ్ల్యూడీ సంబంధించిన చర్యలు చేపట్టినట్టు తేల్చిందని చెప్పారు. విపక్షాలు (ఆనాడు కాంగ్రెస్‌ నేతలు) చేస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు నిరాధారమని 27.10.2023న కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ రిపోర్ట్‌ ఇచ్చినట్టు వివరించారు.

హార్డ్‌ డిస్క్‌ తొలగించారని ఆదేశాలు ఎవరిచ్చారు…?
ఈ సుదీర్ఘ వాదనల మధ్య… జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ పిటనర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌కు పలు ప్రశ్నలు సందించారు. ‘మీరు దాదాపు 26 హార్డ్‌ డ్రైవ్‌లను తీసివేశారు. పాస్‌వర్డ్‌ ఇవ్వమని మిమ్మల్ని ఆదేశించినప్పుడు మీరు ప్రతిదీ మర్చిపోయారని చెప్పారు. తరువాత గుర్తుంచుకోగలిగారు. వారు దాన్ని యాక్సెస్‌ చేసినప్పుడు ఏమీ అందుబాటులో లేదు. అందులో ఎలాంటి సమాచారం లేదు. ఇది క్రైం కదా?’ అని ప్రశ్నించారు. ఇది ఐటీ యాక్ట్‌ కిందకు వస్తుందని జస్టిస్‌ నాగ రత్న గుర్తు చేశారు. దీనికి రంజిత్‌కుమార్‌ స్పందిస్తూ… మరోసారి కేసులోని అఫిడవిట్‌, ఇతర అంశాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. దీంతో జస్టిస్‌ మహదేవన్‌ జోక్యం చేసుకొని.. మిమ్మల్ని సింగల్‌ లైన్‌ ఆన్సర్‌ అడుగుతున్నాను అంటూ ‘హార్డ్‌ డిస్క్‌లలో డేటా తొలగించాలని మీకు లిఖిత పూర్వక ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా ?. ఆ ఆదేశాల ప్రతులు చూపండి. మీకు హార్డ్‌ డిస్క్‌లు తొలగించాలని ఆదేశాలు ఉండొచ్చు. కానీ ఆ హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేయమని కాదు’ అని అన్నారు. డిసెంబర్‌ 2, 2023 కు ముందు ఈ డేటా మొత్తం రివ్యూ కమిటీ వద్ద ఉంటుందని రంజిత్‌ కుమార్‌ బదులిచ్చారు. దీనిపై వారికి యాక్సెస్‌ లేదని ఆ కమిటీ దగ్గర ఉన్నందున… వారు మాత్రమే ఈ సమాచారం ఇవ్వగలరన్నారు. ఇందుకు జస్టిస్‌ మహదేవన్‌ సమాధానం ఇస్తూ… ‘అందుకే మిమ్మల్ని పర్సనల్లీ ఇంటారాగేషన్‌ చేయాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఒక ఆఫీసర్‌ ఎలా 36 హార్డ్‌ డిస్క్‌లను తీసుకెళ్తారని, తర్వాత వాటిని ఎలా ధ్వంసం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే… తామెలాంటి హార్డ్‌ డిస్క్‌లను తీసుకెళ్లలేదని రంజిత్‌ కుమార్‌ కోర్టుకు తెలిపారు. మరి అలాంటప్పుడు ఆ డేటా ఎక్కడుందని జస్టిస్‌ నాగరత్న ప్రశ్నించారు.

అనంతరం లంచ్‌ బ్రేక్‌ కావడంతో ధర్మాసనం విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఆ తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. వాస్తవాలను రాబట్టేందుకు ప్రభాకర్‌ రావును నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకొని… అతన్ని లొంగిపోనివ్వండి, కానీ శారీరక హాని జరగకూడదని స్పష్టం చేశారు. అయితే కస్టడీ టైంలో ఒక అడ్వొకేట్‌ను అనుమతించాలని కోరారు. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. ఆ రోజు జరిగే వాదనలను బట్టి కస్టడీ టైంను పొడగించమని కోరవచ్చని ప్రభుత్వ అడ్వొకేట్‌కు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -