సచివాలయంలో ఎకో టూరిజం స్క్రీనింగ్ కమిటీ భేటీ
నీలాద్రి అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలి: రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో తెలంగాణను ఎకో టూరిజం హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. గుర్తించిన సైట్లలో అభివృద్ధి పనులపై కసరత్తు జరుగుతున్నదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఎకోటూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ సమావేశం మంత్రి సురేఖ అధ్యక్షతన జరిగింది. అందులో ఎఫ్డీసీ చైర్మెన్ పొదెం వీరయ్య, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) డాక్టర్ సువర్ణ, తెలంగాణ ఎఫ్డీసీ ఎమ్డీ సునీత భగవత్, పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్) ఏలూ సింగ్ మేరు, సీసీఎఫ్ డాక్టర్ జి. రామలింగం(సోషల్ ఫారెస్టు), పలు జిల్లాల డీఎఫ్ఓలు, ఆర్థిక శాఖ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ స్క్రీనింగ్ కమిటీ భేటీలో అనంతగిరి(వికారాబాద్), కనకగిరి(ఖమ్మం), నందిపేట్(నిజామాబాద్), మన్ననూర్ జంగల్ రిసార్టు(నాగర్ కర్నూల్), ఎకో పార్కు(నల్లగొండ), వైజాగ్ కాలనీ(నల్లగొండ), మంజీరా(సంగారెడ్డి), అమరగిరి(నాగర్ కర్నూల్) తదితర ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు అమలుపై సుదర్ఘీ చర్చ జరిగింది.
వికారాబాద్ అనంతగిరి హిల్స్ మొదటి దశ పనులు పూర్తయ్యాయనీ, రెండో దశలో కారవాన్ క్యాంపింగ్, ఎకో కాటేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మంలోని కనకగిరి ప్రాజెక్టు పనులు అక్టోబర్ 2025 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. నల్లగొండ ముచ్చర్ల ఎకో పార్క్ నైట్ సఫారీ, వీఆర్ పార్క్, డైనోసార్ పార్క్ వంటివి రూపకల్పన చేసినట్టు వివరించారు. సంగారెడ్డిలోని మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో భూసేకరణ, భూమి కేటాయింపు సమస్యల పరిష్కారం పెండింగ్లో ఉందన్నారు. ఎక్కడికక్కడ ఆయా ఎకో టూరిజం సెంటర్లలో స్థానిక గిరిజనులు, ఇతర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేయాలని మంత్రి సురేఖ సూచించారు. దేవాలయాలున్న ప్రాంతాల్లో ఆధ్యాత్మిక పద్ధతిలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మధ్యప్రదేశ్లోని భీమ్బెక్కా కొండల తరహాలో నీలాద్రి కొండలపై ప్రాచీన కాలం నాటి గుర్తులున్నందున ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు. అవసరమైన నిధులను పర్యాటక, దేవాదాయ శాఖల నుంచి తీసుకోవాలని సూచించారు.