సిర్పూర్ కాగజ్ నగర్లో నిర్వహణ
పోస్టర్ ఆవిష్కరించిన సీఐటీయూ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ శ్రామిక మహిళా రాష్ట్ర కన్వెన్షన్ అక్టోబర్ 5,6 తేదీల్లో కొమ్రంభీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్లో నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ.రమ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కన్వెన్షన్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మహాసభకు రాష్ట్ర నలుమూలల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారనీ, వాటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామనీ, మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ భద్రత కోసం చేయాల్సిన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ఉపాధి కల్పనలో మహిళలు తీవ్ర అసమానతలను ఎదుర్కొంటున్నారనీ, పనిప్రదేశాల్లో వేధింపులు, వివక్షకు గురవుతున్నారని చెప్పారు.
మన దేశ ఉత్పత్తిలో శ్రామిక మహిళల శక్తి భాగస్వామ్యరేటు 28.4 శాతమే ఉందనీ, తెలంగాణలో ఆ సంఖ్య మరింత తక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. 90 శాతం మంది మహిళలు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారని తెలిపారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, వారి పనికి సరైన గుర్తింపు దక్కట్లేదని చెప్పారు. మహిళలు శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పనిప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. మహాసభకు ముఖ్య అతిథులుగా సీఐటీయూ జాతీయ కార్యదర్శులు దీపా కె.రాజన్, కోశాధికారి ఎం.సాయిబాబు హాజరవుతారని తెలిపారు. మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పోస్టరావిష్కరణలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు పద్మశ్రీ, కాసు మాధవి, కోశాధికారి వంగూరు రాములు, తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 5,6 తేదీల్లో తెలంగాణ శ్రామిక మహిళా రాష్ట్ర కన్వెన్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES