‘భద్రాద్రి’పై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భద్రాచలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో అక్కడి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోగల ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తిగా ఆగమశాస్త్రానుసారం పనులు చేపట్టాలని కోరారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించాలని, ఆ అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి ఉండాలంటూ దిశా నిర్దేశం చేశారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ పనులు పూర్తి కావాలని అన్నారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.



