– జమ్మూ కాశ్మీర్లో 420 కార్మిక సంఘాలు రద్దు
– పది గంటల పనివిధానానికి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం
– కర్నాటకలో నాలుగు లేబర్కోడ్ల అమలు ప్రకటన
– అవి అమల్లోకి వస్తే కట్టుబానిసలుగా కార్మికులు
విముక్తి కోసమే జులై 9న సార్వత్రిక సమ్మె : సీఐటీయూ
జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లేబర్ కోడ్లు రాకముందే దేశవ్యాప్తంగానూ కార్మికవర్గంపై దాడి తీవ్రమైందని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత చెప్పారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో 420 కార్మిక సంఘాలను రద్దు చేయాలనీ, పది గంటల పని విధానానికి ఆమోదం తెలుపుతూ ఇటీవల తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించిందనీ, కర్నాటకలోనూ కోడ్లను అమలు చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. లేబర్ కోడ్లు అమలోకి వస్తే కార్మికులు కట్టుబానిసలుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకురాబోతున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కార్మివర్గం ఓవైపు సమ్మెను వాయిదా వేస్తే… మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం లేబర్ కోడ్ల అమలును ముందుకు తీసుకెళ్తున్నదని చెప్పారు. కర్నాటక, జమ్మూకాశ్మీర్, తెలంగాణ, తదితర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను వివరించారు. రాత్రి విధుల్లో మహిళలు పనిచేయాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. కోడ్ల సాకుతో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ను కఠినతరం చేయడం, కార్మిక సంఘాలను రద్దు చేయడం దారుణమన్నారు. కార్మిక శాఖను పూర్తిగా ఫెసిలిటేట్ (మధ్యవర్తిత్వ శాఖ) విభాగంగా మార్చడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక హక్కులను నిర్వీర్యం చేయడం, కార్మిక చట్టాలను సరళతరం చేయడం, కార్మిక సంఘా లు లేని భారత దేశాన్ని పెట్టుబడి దారులు, కార్పొరేట్ శక్తులకు బహుమానంగా ఇవ్వడం మోడీ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దశాబ్దాల పాటు కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని నొక్కి చెప్పారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతూ, మతోన్మాద చర్యల ద్వారా కార్మికవర్గ ఐక్యతకు విచ్ఛిన్నం చేసే చర్యలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. జులై 9 సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఆఫీస్ బేరర్లు ఎస్.వీరయ్య, భూపాల్, జె.వెంకటేష్, ఎస్.రమ, పి.జయలక్ష్మీ, వంగూరు రాములు, ఎం.పద్మశ్రీ, వీఎస్.రావు, ఎ.ముత్యంరావు, రాగుల రమేష్, కళ్యాణం వెంకటేశ్వర రావు, టి.వీరారెడ్డి, టి.రాజారెడ్డి, బి.మల్లేష్, కూరపాటి రమేష్, పి.శ్రీకాంత్, కాసు మాధవి, కె.గోపాలస్వామి, ఏజే..రమేష్, ఎం.వెంకటేష్, బి.మధు, జె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
– జులై 9న సమ్మెలోకి భవన నిర్మాణ కార్మికులు : డిప్యూటీ లేబర్ కమిషనర్కు సీఐటీయూ సమ్మె నోటీసు
లేబర్ కోడ్లతో సంఘం పెట్టుకునే, వేతనం కోసం బేరసారాలు ఆడే హక్కులను భవన నిర్మాణ కార్మికులు కోల్పోతారని తెలం గాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆర్.కోటంరాజు, ఉపాధ్యక్షులు ఎ.రాజు వాపోయారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, కార్మికుల హక్కులను పునరుద్ధరించాలని జులై 9న జరిగే సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పెద్దఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని అంజయ్యభవన్ లో డిప్యూటీ లేబర్ కమిషనర్ ఈ.గంగాధర్కు సమ్మె నోటీసు అందజేశారు. కోడ్లతో కార్మిక శాఖ నిర్వీర్యం అవుతుందని తెలిపారు. వాటితో భవన నిర్మాణ కార్మికుల హక్కులన్నీ హరించబడతాయని వాపోయారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 9న జరిగే సమ్మెలో భవన నిర్మాణ కార్మికులంతా పాల్గొంటారని స్పష్టం చేశారు.
లేబర్ కోడ్లు రాకముందే దాడి తీవ్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES