బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించటంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టు గడువు విధించటం అనే అంశంపై కేంద్రం స్పందించింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించేలా కోర్టులు వారిని నిర్దేశించవచ్చా? అన్నదానిపై సుప్రీంకోర్టు నోటీసులకు కేంద్రం బదులిచ్చింది. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని సుప్రీంకోర్టుకు విన్నవించింది. కొన్ని అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. బిల్లుల అంగీకారం అంశంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. బిల్లులపై గడువు విధింపుతో రాష్ట్రపతి, గవర్నర్ల అత్యున్నత స్థానాన్ని తగ్గించినట్టు అవుతుందని కూడా కేంద్రం అభిప్రాయపడింది. ఆ రెండు స్థానాలు ప్రజాస్వామ్య పాలనకు ఉన్నత ఆదర్శాలు అని పేర్కొంది. వారి విధుల్లో ఏవైనా లోపాలు ఉంటే న్యాయ జోక్యాల కంటే.. రాజ్యాంగపరమైన యంత్రాంగంతో సరిదిద్దాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సుప్రీం కోర్టు నిర్ణీత కాలపరిమితిని విధించడం వల్ల రాజ్యాంగం స్థాపించిన సున్నితమైన సమతుల్యత చెదిరిపోతుందని, చట్టపాలనను తిరస్కరిస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఏమైనా సమస్యలుంటే, వాటికి రాజకీయ సమాధానాలు అవసరమని, తప్పనిసరిగా న్యాయపరమైన సమాధానాలు కావని అన్నారు. రాష్ట్ర బిల్లును స్వీకరించిన తరువాత గవర్నర్లు, రాష్ట్రపతి ప్రత్యామ్నాయాలను పరిష్కరించే ఆర్టికల్ 200, 201 ఉద్దేశపూర్వకంగా కాలక్రమాలను కలిగి లేవని అన్నారు. న్యాయపరంగా అలాంటి పరిమితిని పరిగణనలోకి తీసుకుంటే రాజ్యాంగాన్ని సవరించడమే అవుతుందని తెలిపారు. గవర్నర్ సమ్మతి అనేది ప్రత్యేక హక్కు, న్యాయబద్ధం కాని అధికారం అని అందులో పేర్కొన్నారు. సమ్మతి స్వయంగా శాసనపరమైనదని అన్నారు.
ఆ అధికారం కోర్టుకు ఉండదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES