– జర్నలిస్టులను చంపటం దారుణం
– అమెరికా సాయాన్ని నిలిపేయాలి
– న్యూయార్క్లో నిరసన ర్యాలీ
– ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నినాదాలు
న్యూయార్క్ : గాజాపై ఇజ్రాయిల్ జరుపుతోన్న మారణహోమానికి వ్యతిరేకంగా అమెరికాలోనూ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇటీవల ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవటం, యూఎస్ బ్లాక్అవుట్లకు వ్యతిరేకంగా న్యూయార్క్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇజ్రాయిల్ చర్యలను ఖండిస్తూ ఆందోళనకారులు ర్యాలీ జరిపారు. గాజాలో మారణహోమాన్ని ఆపాలని వారు డిమాండ్ చేశారు. పాలస్తీనియన్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు.గాజాలో మహిళలు, చిన్నారులనే తేడా లేకుండా ఇజ్రాయిల్ సైన్యం దారుణంగా ప్రవర్తిస్తున్నది. జర్నలిస్టులను కూడా టార్గెట్ చేసుకుంటూ వారిని చంపేస్తున్నది. మధ్యప్రాచ్యంలో ప్రముఖ వార్త చానెల్ ‘అల్ జజీరా’కు చెందిన జర్నలిస్టులు.. గాజాలో ఇజ్రాయిల్ ఇటీవల జరిపిన వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇజ్రాయిల్ చర్యలపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలు దేశాలు.. ఇజ్రాయిల్ చర్యను తీవ్రంగా ఖండించాయి. ఇదే విషయంపై ఇటు అమెరికాలోనూ ఆందోళనలు జరుగుతోన్నాయి. దాడుల్లో జర్నలిస్టుల ప్రాణాలను తీసుకోవటంపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గాజాలో ఇజ్రాయిల్ వైఖరికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఇజ్రాయిల్కు అమెరికా నుంచి అందే సాయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్లో గల ప్రముఖ వార్త సంస్థ ‘ది న్యూయార్క్ టైమ్స్’ ముందు ఈ నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా అమెరికా మీడియా తీరు పైనా ఆందోళనకారులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గాజాలో ఇజ్రాయిల్ జరుపుతోన్న మారణహోమాన్ని యూఎస్ మీడియా కప్పి పుచ్చుతున్నదనీ, వాస్తవాలను బయటకు చెప్పటం లేదని ఆందోళన వెలిబుచ్చారు. గాజాను తాము ఆక్రమించుకోబోమని చెప్తూనే ఇజ్రాయిల్ ఇక్కడ దాడులు జరుపుతున్నది. గాజాకు హమాస్ నుంచి విముక్తి కల్పిస్తామనీ, ఆ సంస్థను అంతం చేస్తామనే సాకుతో నెతన్యాహు ఏకపక్ష చర్యలకు దిగుతున్నారని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. తనపై జరుగుతున్న న్యాయ విచారణలు, కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే గత 22 నెలలుగా నెతన్యాహు గాజాపై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని వివరిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా.. అమెరికా అండ చూసుకొనే గాజాపై ఇజ్రాయిల్ తీవ్రంగా రెచ్చిపోతున్నదని విశ్లేషకులు అంటున్నారు.
గాజాలో మారణహోమాన్ని ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES