నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా సబ్జెక్టు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ సూచించారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మహాత్మ బిసి జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, పలకపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, ఉప్పునుంతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఉప్పునుంతల జెడ్పీహెచ్ఎస్లో కొనసాగుతున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించి, సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తయ్యిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు సమయానికి పౌష్టికాహారం అందించాలని సూచించారు.
డీఈఓ మాట్లాడుతూ.. గుణాత్మక బోధనతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచి అనుకూల వాతావరణం కల్పించాలని, పరీక్షల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నందున ప్రతిరోజూ చిన్న పరీక్షలు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రతి పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్నాక్స్ అందజేశారు.



