– కక్షగట్టిన కేంద్రం
– తక్షణమే కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలి
– 12న సమ్మెను దిగ్విజయం చేయండి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
నవతెలంగాణ- జహీరాబాద్
దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అమలైతే.. కార్మికుల మెడకు ఉరితాడులా మారుతాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈనెల 12న దేశవ్యాప్త సమ్మె జయప్రదం కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని దీదీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయడం ద్వారా కార్మికులను పూర్తిస్థాయి బానిసలుగా మార్చేందుకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేసేందుకే లేబర్కోడ్లను తెచ్చిందని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న గుప్పెడు మంది పెట్టుబడిదారుల కోసం కోటానుకోట్ల మంది కార్మికవర్గాన్ని బలి చేయడం సరైనది కాదన్నారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరులో భాగంగానే 12న దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్టు తెలిపారు. సమ్మెను జయప్రదం చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్, వివిధ పరిశ్రమల యూనియన్ల ప్రధాన కార్యదర్శులు సిహెచ్.నరేష్, నరసయ్య, మహేశ్వర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
లేబర్కోడ్లు కార్మికుల మెడకు ఉరితాళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



