కేంద్రం గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేస్తుంది
నవతెలంగాణ – ఆలేరు
కేంద్ర ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని పేరు మార్చడం విరమించుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఓబుల్ కేశపురంలో సోమవారం తమిళనాడు మాజీ పార్లమెంటు సభ్యుడు విశ్వనాథన్ తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వి బి జి రాంజి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీల పర్యవేక్షణ ద్వారా మహాత్మ గాంధీ ఉపాధి హామీ చట్టం తో పేదరికం నుండి ఉపశమనం లభిస్తుందని, నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది అన్నారు. గత చట్టంలో అన్ని గ్రామ పంచాయతీలు మహాత్మ గాంధీ ఉపాధి హామీ చట్టం ద్వారా పేదలకు పని కల్పించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కేంద్రం తెచ్చిన చట్టం వల్ల ఎంపిక చేసిన గ్రామపంచాయతీ మాత్రమే పని కల్పించేందుకు చట్ట సవరణ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మొత్తం కేంద్రం నుండే ఈ పనులకు నిధులు విడుదల అయ్యేది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కొరివి పెట్టడం పేదల పట్ల కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఉపాధి కోల్పోయే చర్యలు వెంటనే మానుకోవాలని హితువు పలికారు.



