సీఎం రేవంత్రెడ్డికి పీఆర్టీయూటీఎస్ వినతి
డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) వర్తింపజేయాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి నేతృత్వంలో పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సోమవారం హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూటీఎస్ నూతన సంవత్సరం డైరీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ 57 ద్వారా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ను వర్తింపజేయాలని కోరారు. రెండు దశాబ్ధాల నుంచి పెండింగ్లో ఉన్న సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని సూచించారు.
తద్వారా పూర్తిస్థాయి పర్యవేక్షణ అధికారులను నియమించడం వల్ల విద్యావ్యవస్థ మెరుగుపడుతుందని వివరించారు. వేసవి సెలవుల్లో పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని కోరారు. ఈ అంశాలతోపాటు పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలనీ, పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్రెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధికార ప్రతినిధి వంగ మహేందర్రెడ్డి, మాజీ అధ్యక్షులు పి వెంకట్రెడ్డి, మాసపత్రిక ప్రధాన సంపాదకులు జగన్మోహన్ గుప్త, ఆడిట్ కమిటీ చైర్మెన్ ఎస్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ-2003 టీచర్లకు ఓపీఎస్ వర్తింపజేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



