ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన..
నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
పాలస్తీనాపై ఇజ్రాయిల్ క్రూరమైన అణచివేత ఆపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గాజాలో కొనసాగు తున్న మారణహోమానికి వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ సహ ఇతర వామపక్ష ప్రగతిశీల సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆయా సంఘాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు సూరజ్ ఎలామోన్, సహాయ కార్యదర్శి మెహినా ఫాతిమాను ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్ వద్దనే అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని అదుపులోకి తీసుకునేందుకు వందలాది మంది పోలీసులు మోహ రించడంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎస్ఎఫ్ఐ ఢిల్లీ కార్యదర్శి ఐషీఘోష్ మాట్లాడుతూ స్వేచ్ఛా యుత పాలస్తీనా కోసం చేస్తున్న తమ దృఢమైన డిమాండ్ను అరెస్టులతో మసకబార్చ లేరన్నారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా గాజా కోసం ఆందోళన చేపట్టిన కార్యకర్తల విడుదలకు డిమాండ్ చేశారు. స్వేచ్ఛ కోసం డిమాండ్ చేసినవారిని అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ అన్నారు. మారణ హోమం, కరువు, క్రూరమైన యుద్ధ నేరాలకు ఇజ్రాయిల్ బాధ్యత వహించాలన్నారు. యుద్ధ ఆయుధంగా ఆకలిని ఉపయోగించడాన్ని వ్యతిరేకి స్తున్నామన్నారు. ఇజ్రాయిల్ దురాక్రమణను దేశాలు ఐక్యంగా వ్యతిరేకించాలని కోరారు.
పాలస్తీనాపై అణచివేత ఆపాలి
- Advertisement -
- Advertisement -