Wednesday, June 4, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'మేఘ' గర్జన

‘మేఘ’ గర్జన

- Advertisement -

‘బాంబుల పొగ, దు:ఖపు సెగ’ ఏడాదిన్నరగా పాలస్తీనా కథ ఇది. ఈ కథకు కారాణాలను ప్రశ్నించిందా విద్యార్థిని. ఈ విధ్యంసానికి మన మద్దతు ఎందుకు అని గర్జించింది. ఆ వికృత గీతానికి మనం ఎందుకు స్వరాలు కూర్చటమని నిలదీసింది. పాలస్తీనా మాటెత్తితే చాలు, ఏకంగా యూనివర్సిటీలపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉక్కుపాదం మోపుతున్న వేళ.. భారత సంతతి విద్యార్థిని మేఘ వేమూరి అదే అమెరికా నడిబోడ్డున నిజాలను నిగ్గదీసింది. కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) గ్రాడ్యుయేషన్‌ సెర్మీన్‌ వేదిక నుంచి ఏకంగా పాలస్తీనాకు మాటలతోనే కాదు, రూపంతో కూడా సంఘీభావంగా నిలిచింది. పాలస్తీనా అంతటా కమ్ముకున్న కారుమబ్బులను చీలుస్తూ ఆమె మాటలు తూటాల్లా తాకాల్సిన వారికి గట్టిగానే తాకాయి. ఇప్పుడు ఆ ధిక్కార స్వరం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది. అందుకే ఆగమేఘాల మీద ఆమెపై చర్యలకు ఉపక్రమించారు.

‘విస్తరించిన మౌనాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్న కాలంలో, ఆకృత్యాలు రక్తమోడు తూనే ఉన్నాయి. గుండెలన్నీ చుట్టూ ఉన్నా కొట్టుకోవటం మరచిపోయాయా! అమానవీయతను చుట్టుకు న్నాయా?’ అని ఆవేదన చెందుతాడోకవి. నిజమే, మన కండ్లముందు జరగకూడనివి, దుర్మార్గమైనవి జరుగుతున్నప్పుడు మౌనంగా ఎలా ఉండగలం! మౌనంగా ఉండి మనుషులం ఎలా కాగలం! ఈ మౌన సంస్కృతిని ఛేదించకపోతే మారాలని కోరుకుంటున్న సమాజం ఎలా మారుతుంది. మనుషులు ఇంత శక్తి హీనంగా చైతన్య రహితంగా ఎందుకు మారారు? ఇదే రేపు మనకూ ఎదురైతే! మనదాకా వచ్చినప్పుడు ఎవరుంటారు, ఎవరింటారు! మనల్ని మనం వెన్నుపై చరచుకుని మెలుకువ తెచ్చుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు ఆ వెన్ను చరిచే పనే మేఘా చేసింది.


”పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ దాడికి అమెరికా మాత్రమే కాదు, మన యూనివర్సిటీ కూడా సాయం చేస్తోంది. వాటిని ప్రోత్సహిస్తోంది” అంటూ ఆమె కమెన్స్‌మెంట్‌ సెర్మనీ వేదికగా కుండబద్దలు కొట్టింది. ఏ మాత్రం బెరుకు లేకుండా ”ఎంఐటీ విద్యార్థులు స్వేచ్ఛాయుత పాలస్తీనాను కోరుకుంటున్నారు. ఒక జాతి విధ్వంసాన్ని విద్యార్థులు సహించలేరు. మా జీవితాలను శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లు, విద్యావేత్తలు, నాయకులుగా తీర్చిదిద్దుకుంటాం. అలాగే ఆయుధ నిషేధానికి పిలుపునిచ్చేందుకు కూడా మేం అంతే కట్టుబడి ఉన్నాం. ఎంఐటీ విద్యార్థులుగా ఇజ్రాయిల్‌తో సంబంధాలను తెంచుకోవాలని వర్సిటీని డిమాండ్‌ చేస్తూనే ఉంటాం” అంటూ మేఘంలా గర్జించింది. అమెరికా ఇజ్రాయిల్‌ విద్యావ్యవస్థల ద్వంద్వ స్వభావాన్ని మేఘా ప్రపంచం ముందు ఎండగట్టింది. క్రమక్రమంగా కోల్పోతున్న ప్రపంచ ఆధిపత్యాన్ని తిరిగి పొందడానికి అమెరికా అధ్యక్షుడు బరితెగిస్తూ విపరీత చర్యలు ప్రకటిస్తుంటే, అదే గడ్డపై నిలిచి అమెరికా విద్యాల యాల పరిశోధనలు ఇజ్రాయిల్‌ హింసోన్మాదానికి ఎలా సహకరిస్తున్నాయో ఎలుగెత్తి ప్రపంచానికి చాటడం చిన్న విషయం కాదు. విశ్వగురువు సైతం జీ హుజూర్‌ అంటూ సాకిలపడిన కొండను ఢకొీట్టింది మేఘా వేమూరి. తన వ్యక్తిగత భవిష్యత్తును ఫణంగా పెట్టి మరీ ఆమె ఈ సాహసానికి పూనుకుంది.


ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా విద్యాసంస్థలపై అనిశ్చితి చీకట్లు కమ్ముకున్నాయన్నది బహిరంగ రహస్యమే. తర్వాత ఏం జరగనుందనే అందరి మనస్సులోని ప్రశ్నలకు ఆమె ప్రతి రూపమై ధ్వనిస్తోంది. విద్యాలయాల్లో భిన్న దృక్పధాలు, ప్రశ్నించేతత్వం లేకుండా విజ్ఞానం వికసించదు. కళ్లెదురుగా జరుగుతున్న దుర్మార్గాలను, అన్యాయాలను, వాటి మూలాలను పరిశోధించడం, తమ అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించడం విద్యకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలని మేఘా అభిప్రాయం. అదే నేడు ఆచరణలో చూపింది. ఆ మాత్రపు ప్రశ్నను కూడా ప్రపంచంలోని అనేక దేశాధినేతలు, వారి అనుయాయులు సహించలేకపోవడం, వణికిపోవడం వారి భయాందోళనలనే సూచిస్తోంది. కొద్ది నెలల క్రితం అమెరికాలోని ప్రిన్‌టన్‌ యూనివర్సిటీలో పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శనలో పాల్గన్న నూట పది మంది విద్యార్థులను అరెస్టు చేసిన విషయం ఆమెకు తెలియనిదేమీ కాదు. అయినా వెరువని ధీర ఆమె. యేటికి ఎదురీదేవాళ్లు కొందరుంటారు మేఘాలా. వాళ్లు తామెంతగా నష్టపోయినా, ఎన్ని ఇక్కట్లకు గురయినా, ఎన్ని సవాళ్లు ఎదురయినా విలువల అడుగులపైనే నిలబడి ఉంటారు. వారు అరుదుగా కనిపించవచ్చు. కానీ, అలాంటి వాళ్లే నేడు సమాజానికి అవసరం.

https://navatelangana.com/for-speaking-out-in-support-of-palestine/


‘తను వేదికపై తెలిపింది నిరసన కాదు నిజాన్ని’ అని మరింత గట్టిగా చెబుతుంది. జెనోసైడ్‌లో పాలుపంచుకున్న సంస్థ వేదికపై నేను నడవడానికి కూడా ఇష్టపడటం లేదని సూటిగా స్పష్టంగా తేల్చి చెప్పింది. ప్రశ్నించడం రాని చదువుకు పదునుండదు. సత్యం ధ్వనించని శబ్ధంలో శక్తి నిండదు. కాబట్టే స్వేచ్ఛా స్వరాలు తమ దారిని తాము వెతుక్కుంటాయి. ముళ్లూ రాల్లూ ఎన్నున్నా ముందుకుపోయే అడుగులుంటాయి. అలాంటి అడుగే మేఘా వేమూరి వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -