ఆడపిల్లలకు చెప్పుకోవడానికి తల్లి ఇల్లు, అత్త ఇల్లు అని రెండు ఉంటాయి. కానీ తనకంటూ సొంతంగా ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉండదు. పుట్టింటికి వెళితే మీ ఇంటికి వెళ్లు అంటారు, అత్తింట్లో ఉన్నప్పుడు మీ ఇంటికే వెళ్లు అని అంటారు. అంతే తప్ప ఒక్కరు కూడా ఇది నీ ఇల్లు అని ఆమెకు ధైర్యం ఇచ్చే మాటలు మాట్లాడరు. అత్తగారింట్లో ఆమె కోడలిగా ఎన్నేండ్లు గడిపినా ఆ ఇల్లు తనదే అనే ఫీలింగ్ ఉండదు. పరాయి మనిషిగానే చూస్తారు. ఆ ఇంట్లో అందరి మంచీ చెడులు చూస్తూ అన్నీ బాధ్యతగా చేస్తున్నా సరే ఆమెను ఆ ఇంట్లో పనిషిగా గుర్తించని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ సమస్యతో బాధపడే ఓ మహిళ జీవితం గురించి నేటి ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో తెలుసుకుందాం…
రాధికకు సుమారు 48 ఏండ్లు ఉంటాయి. ఆమె భర్త శ్రీనివాస్కు 55 ఏండ్లు. వారికి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, అబ్బాయి. ఇంట్లో మొత్తం ఆరుగురు ఉంటారు. అమ్మాయికి పెండ్లి చేసి ఏడాది అవుతుంది. ఆమె వాళ్ల అత్తగారింట్లో ఉంటుంది. అబ్బాయికి కూడా పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. రాధికకు పెండ్లి అయి 27 ఏండ్లు అవుతుంది. మొదట్లో సుమారు ఎనిమిదేండ్లు ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నారు. ఇంట్లో అందరూ కలిపి 18 మంది వుండేవారు. రాధిక అంత మందికీ అన్ని పనులు చేస్తూనే ఉద్యోగానికి వెళ్లేది. రెండేండ్ల కిందట ఆమె పని చేస్తున్న కంపెనీ మూతబడటంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఉద్యోగం చేసేటపుడు ఆమె సంపాదన మొత్తం ఇంట్లో ఖర్చులు చూసుకుంటూ కొంత పొదుపు చేసుకుంటూ బంగారం కొని కూతురు పెండ్లిలో పెట్టింది.
‘నేను ఏది చేసినా పిల్లల కోసమే కదా, వారికి కాకపోతే ఇక ఎవరికి ఖర్చు చేస్తాను’ అనుకుంది. ఇంకా కొంత డబ్బు ఆమె దగ్గర ఉంది. అది అబ్బాయి కోసమని దాచి పెట్టింది. కానీ ప్రస్తుతం ఆమెకు ఉద్యోగం లేకపోవడంతో ఆమె పొదుపు చేసిన డబ్బుల్లోనే కొద్ది కొద్దిగా ఖర్చు చేసుకుంటుంది. వేరే ఉద్యోగం కోసం వెతుకుతుంది. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఆమె భాగస్వామ్యం ఉండదు. ఎవరికైనా ఏదైనా అవసరం వుంటే మాత్రం ఆమెను అడిగి తీసుకుంటారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, పండుగలైనా ఇంట్లో పని చేయడం, డబ్బులు ఖర్చు పెట్టడం వరకే ఆమె పని. ఏం వండాలి, ఆమె ఇచ్చే డబ్బు ఎలా ఖర్చు చేయాలి అనే దాంట్లో ఆమెకు ఎలాంటి సంబంధం ఉండదు.
చివరకు కూతురు పెండ్లి విషయంలో కూడా ఆమెను భాగస్వామ్యం చేయలేదు. ఆమె అడిగినా ‘నీకెందుకు అవన్నీ, నీకు చెప్పి అన్నీ చేయాలా?, ఎలాంటి అబ్బాయిని చూడాలో నిన్ను అడగాలా’ అంటూ భర్త ఆమె మాటలను లెక్క చేసేవాడు కాదు. అయినా కూడా కాబోయే అల్లుడు గురించి రాధిక వేరే వాళ్ల ద్వారా కొంత సమాచారం తెలుసుకుంది. ఇక ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయిన తర్వాత అత్తమామలను చూసుకునే బాధ్యత రాధికపైనే పడింది. ఆరు నెలల ముందు మామయ్య చనిపోయాడు. అప్పటి నుండి అత్త ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. అయినా రాధిక ఎంతో ఓపికతో ఆమెను చూసుకుంటుంది.
ఆమెకు ఇద్దరు తోటికోడళ్లు ఉన్నారు. వారు అత్త గురించి అస్సలు పట్టించుకోరు. అయినా రాధిక ఏమీ అనలేదు. ఆమెనే పూర్తి బాధ్యత తీసుకుంది. ఇంట్లో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఉన్న ఆస్తి మొత్తం పిల్లలందరికీ సమానంగా ఇవ్వకుండా ఒకరికి ఎక్కువ, ఇంకొకరికి తక్కువ పంచడంతో ఈ గొడవలు మొదలయ్యాయి. ఇందులో కూడా రాధిక ప్రమేయం ఏమీ లేదు. అయినా రాధిక వల్లనే గొడవలు అంటూ అందరూ ఆమెనే అన్నారు. ఇంత జరుగుతున్నా ఈ గొడవల గురించి ఆమెకు ఏమీ తెలియదు. భర్త ఒక్క విషయం కూడా ఆమెకు చెప్పలేదు. చివరకు ఈ గొడవల్లో వాళ్లు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీనికి ఆమె ఒప్పుకోలేదు. ‘ఇన్నేండ్లు ఉండి ఇప్పుడు మనం ఎందుకు బయటకు వెళ్లాలి, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం, ఆ తర్వాత వెళ్లాలో వద్దో ఆలోచిద్దాం’ అని భర్తకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినందకు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు.
‘భర్త కోపంతో ఉన్నాడు, రెండు రోజులు తల్లిగారింట్లో ఉండి ఆయన కోపం తగ్గిన తర్వాత రావొచ్చు’ అని ఆమె తన పుట్టింటికి వెళ్లింది. ఆమె అక్కడికి వెళ్లేలోపే రాధిక తల్లిగారి వాళ్లకు ఫోన్ చేసి శ్రీనివాస్ అన్ని విషయాలు చెప్పాడు. ఆమె వెళ్లగానే ‘అసలు ఎందుకు వచ్చావు, అక్కడ ఏం జరిగింది’ అని కూడా అడగలేదు, పైగా ‘ఈ ఇల్లు నీది కాదు, మీ అత్తగారి ఇల్లే నీ ఇల్లు’ అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఆమెకు అసలేం అర్థం కాలేదు. ఇన్ని రోజుల నుండి ఆమె ‘నాకు ఇటు అత్తగారిల్లు, అటు అమ్మగారిల్లు రెండు ఉన్నాయి. నేను ఎక్కడైనా ఉండొచ్చు’ అనుకుంది. కానీ ఈ రోజు తనకు ఉండటానికి ఏ ఇల్లు లేదని అర్థం చేసుకుంది.
దాంతో కొన్ని రోజులు ఉమెన్స్ హస్టల్లో ఉంది. అయినా ఆమెను ఎవరూ పట్టించేకోలేదు. కనీసం ఆమె ఎక్కడికి వెళ్లింది అని భర్త, అత్త, తల్లి కుటుంబ సభ్యులు ఎవ్వరూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆమె బయటకు వచ్చి నెల రోజులు అవుతుంది. ఫోన్ చేసినా ఎవ్వరూ ఆమెతో మాట్లాడటానికి సిద్దంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఐలమ్మ ట్రస్ట్కు వచ్చింది.
ఆమె చెప్పింది మొత్తం విన్న తర్వాత మేము భర్త, అత్త వాళ్లను పిలిపించాము. శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఆమె నా మాటలకు విలువ ఇవ్వదు, అలాంటప్పుడు నేను ఆమెతో ఎలా ఉండాలి. నేను ఆ ఇంట్లో నుండి వెళ్లిపోదామంటే ‘వెళ్లి ఎక్కడ వుందాము, ఎందుకు వెళ్లాలి’ అన్న ఆమె నేను ఇంట్లో వద్దు అంటే ఆమె ఎందుకు వెళ్లాలి, అప్పుడు కూడా నేను వెళ్లను అనొచ్చు కదా! అలా అనకుండా నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయింది. మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియాలి’ అన్నాడు.
వాళ్ల అత్తగారు మాట్లాడుతూ ‘భర్త కోపంలో ఏదో అన్నాడని అలా వెళ్లిపోయింది. ఆమె ఇంట్లోనే ఉంటే ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. మేము ఆమె వాళ్ల అమ్మగారి ఇంటికే పోయిందని అనుకున్నాము. కొద్ది రోజులు పోతే ఆమే వస్తుందని ఊరుకున్నాం. ఇప్పుడు వచ్చి మీ ముందు కూర్చోబెట్టింది. ఇదంతా మాకు నచ్చడం లేదు’ అంది. మొత్తంగా ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటని అడిగితే ‘ఎలాగైతే బయటకు వెళ్లిందో అలాగే ఉండమని చెప్పండి. మాకూ ఆమెకు ఎలాంటి సంబంధం లేదు’ అన్నాడు శ్రీనివాస్.
దాంతో రాధిక ‘మన పెండ్లి జరిగి 27 ఏండ్లు అవుతుంది. ఇన్నేండ్లలో నా అభిప్రాయం ఏ విషయంలో అయినా తీసుకున్నారా? అయినా ఏ రోజు నేను ఇలా ఎందుకు చేస్తున్నారని అడగలేదు. ఇన్నేండ్లు సంపాదించింది మొత్తం కుటుంబం కోసమే ఖర్చు పెట్టాను. ఆ డబ్బుతో ఓ ఇల్లు కొనుక్కున్నా బాగుండేది. నా కంటూ సొంత ఇల్లు ఉండేది. ఇప్పుడు అటు అత్తగారు, ఇటు అమ్మగారు ఇద్దరూ నన్ను బయటకు పంపించేశారు. నెల రోజుల నుండి అనాథలా హాస్టల్లో ఉంటున్నాను. ఇన్నేండ్లలో నా భర్త నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆయనకు నా పట్ల ప్రేమ, గౌరవం ఏ మాత్రం లేవు. అప్పుడు నన్ను ఇంట్లో నుండి పంపించేశారు. ఇప్పుడు నేనే వెళ్లి తప్పు చేశానంటున్నారు. నాకూ ఆత్మాభిమానం ఉంటుంది. ఇప్పటి వరకు నా భర్త నా గురించి కాస్త అయినా ఆలోచిస్తాడని అనుకున్నాను. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది. ఇలాంటి వాళ్లతో ఉంటే రేపు రేపు నా పరిస్థితి మరీ హీనంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఇక నేను వాళ్లతో కలిసి ఉండలేను. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బతికేస్తాను, నా సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు అన్నీ ఇచ్చేయండి’ అంది. వెంటనే శ్రీనివాస్ ఆమెవి ఆమెకు ఇచ్చేశాడు. పైగా రాధికకు అహంకారం ఎక్కువ, అందుకే ఇలా మాట్లాడుతుంది అన్నాడు. రాధిక కొడుకు రాహుల్ మాత్రం ‘మా అమ్మ తీసుకున్న నిర్ణయం సరైనదే, నేనూ మా అమ్మతోనే ఉంటా’ అని ఆమెను తీసుకొని వెళ్లిపోయాడు.
రాధిక కథ విన్న తర్వాత మహిళలు ఎప్పుడూ ఆర్థికంగా కొంత పొదుపు చేసుకోవాలి, ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడకుండా తమ కంటూ కొంత దాచిపెట్టుకోవాలి అని ప్రతి మహిళా నేర్చుకోవాలి.
– వై వరలక్ష్మి, 9948794051
ఆమే ఇంట్లో మనిషే…
- Advertisement -
- Advertisement -