– పెద్దమ్మ జాతర ఉత్సవాలు ముగిసిన రాత్రే చోరీ
– ముదిరాజ్ పెద్దమనుషుల ముందు చూపు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ లో శనివారం రాత్రి గ్రామంలోని రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. గ్రామంలోని పెద్దమ్మ ఆలయం, పెద్ద పోచమ్మ మందిరంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పెద్దమ్మ ఆలయంలో చోరీ చేసిన దుండగులు ఒక గ్రాము బంగారం అమ్మవారి పుస్తెలను, పెద్దమ్మ గుడి లో గల హుండీని ఎత్తుకెళ్లారు.పెద్ద పోచమ్మ దేవాలయం నుండి మూడు గ్రాముల వెండి ఆభరణాలు గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేశారు. పెద్దమ్మ ఆలయం నుండి ఎత్తుకెళ్లిన హుండీలో కేవలం 51 రూపాయి మాత్రమే ఉన్నట్లు ముదిరాజ్ సంఘ పెద్దమనిషి జెల్ల సదానంద్ తెలిపారు. శనివారం పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా జాతర, అన్నదాన కార్యక్రమాన్ని ముదిరాజ్ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయంలో అమ్మవారికి అలంకరించిన నగలతో పాటు, పెద్ద మొత్తంలో హుండీలో నగదు దొరుకుతుందన్న ఉద్దేశంతోనే దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే సంఘ పెద్ద మనుషులు ఆలయం గ్రామ శివారులో ఉన్నందున ముందు చూపుతో ఉత్సవాలు ముగిసిన వెంటనే అమ్మవారి నగలను, హుండీలోని నగదును తీసుకెళ్లడంతో దుండగులు ఆశించినట్లు జరగలేదు.పెద్దమ్మ ఆలయంలో జరిగిన చోరీ విషయమై ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సదానంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన పెద్దమ్మ ఆలయం, పెద్ద పోశమ్మ దేవాలయంను కమ్మర్ పల్లి ఏఎస్ఐ నరేందర్ సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పెద్దమ్మ ఆలయం సమీపంలోనే ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో కూడా చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఆలయం తలుపులను పగలగొట్టేందుకు ప్రయత్నించిన సాధ్యపడకపోవడంతో వెనుదిరిగినట్లు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ దుండగులు మాత్రం తమ పని తాము కానిస్తాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఉప్లూర్ లో రెండు ఆలయాల్లో చోరీ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES