81 శాతం బిల్లులను గవర్నర్ ఆమోదించారు
తమిళనాడు రాజ్భవన్ వివరణ
చెన్నై : తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేయడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను రాజ్భవన్ తోసిపుచ్చింది. 81 శాతం బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారని వివరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారని, ఆయన చర్యలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో, పబ్లిక్ డొమైన్లో కొందరు చేస్తున్న నిరాధారమైన, అవాస్తవమైన ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబర్ 31వ తేదీ నాటికి చేరిన మొత్తం బిల్లుల్లో 81 శాతం బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారని రాజ్భవన్ అధికారిక రికార్డులు చెబుతున్నాయని తెలియజేసింది.
‘తన వద్దకు వచ్చిన బిల్లుల్లో 95 బిల్లులకు గవర్నర్ మూడు నెలల వ్యవధిలోనే ఆమోదం తెలిపారు. 13 శాతం బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయడం జరిగింది (వీటిలో 60 శాతం బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రిజర్వ్ చేయడం జరిగింది)’ అని రాజ్భవన్ తన ప్రకటనలో వివరించింది. మిగిలిన బిల్లులు అక్టోబర్ చివరి వారంలో వచ్చాయని, అవి ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉన్నాయని చెప్పింది. శాసనసభకు తిప్పి పంపిన బిల్లులు తిరిగి అసెంబ్లీ ఆమోదం పొంది రాజ్భవన్కు వస్తే వాటిని కూడా ఆమోదించడం జరిగిందని తెలిపింది. పది బిల్లులను గవర్నర్ పక్కన పెట్టారని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేశామని పేర్కొంది. శాసనసభ రెండోసారి ఆమోదించి పంపిన ఈ బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయడం జరిగిందని తెలిపింది.
బిల్లుల ఆమోదంలో జాప్యం జరగలేదు
- Advertisement -
- Advertisement -



