అటార్నీ జనరల్ బోండీకి ట్రంప్ సీక్రెట్ మెసేజ్
వాషింగ్టన్ : తన రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అటార్నీ జనరల్ పామ్ బోండీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ సూచిస్తూ.. ఓ పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బోండీకి ట్రంప్ వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టబోయి.. బహిరంగంగా పోస్టు పెట్టారంటూ నెటిజన్లు పేర్కొంటు న్నారు. అసలేం జరిగిందంటే.. తన రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ పామ్ బోండీతో ట్రంప్ పేర్కొన్నారు. ‘మనం ఇక ఆలస్యం చేయలేం. ఇది మన కీర్తి, విశ్వసనీయతను చంపేస్తుంది. వారు నన్ను రెండుసార్లు అభిశంసించారు. అభియోగాలు మోపారు. న్యాయం జరగాల్సిన సమయం వచ్చింది’ అని రాసుకొచ్చారు. ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ, కాలిఫోర్నియా డెమోక్రటిక్ సెనెటర్ ఆడమ్ షిప్, న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ను ఉద్దేశిస్తూ ఆయన ఈ పోస్టు పెట్టారు.
కొంతకాలం నుంచి వీరితో ట్రంప్కు వైరం నడుస్తోంది. ఈ క్రమంలో వారిపై చర్యలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ పోస్టు పెట్టినట్టుగా ఉంది. ట్రంప్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోండీకి వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టబోయి.. ఆయన ఆన్లైన్లో పెట్టి ఉంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, దీని గురించి అమెరికా అధికారులు స్పందించలేదు. మరోవైపు బోండీని ప్రశంసిస్తూ ట్రంప్ మరో పోస్టు పెట్టారు. యూఎస్ అటార్నీ జనరల్గా ఆమె అద్భుతంగా పనిచేస్తోందన్నారు. కానీ, తన విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు వర్జీనియాలోని లిండ్సే హాలిగాన్ వంటి ప్రాసిక్యూటర్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఆమెను యూఎస్ అటార్నీగా నామినేట్ చేస్తానని ప్రకటించారు. లిండ్సే అందరికీ సమాన న్యాయం చేస్తారని వ్యాఖ్యానించారు.