బక్రీద్ పండుగరోజే విషాదం..
ఇసుక క్వారీ గుంతలో ప్రమాదం.?
నవతెలంగాణ – మల్హర్ రావు: ముస్లిం సోదరి, సోదరుల పర్వదినమైన బక్రీద్ పండుగ రోజున మండలంలోని కొయ్యుర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సయ్యద్ ఉస్మాన్ (బైక్ మెకానిక్) (25) యువకుడు ప్రమాదవశాత్తు అడవిసోమన్ పల్లి మానేరులో మునిగి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల, కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం.. ఉస్మాన్ బక్రీద్ పండుగ వేడుకలకు హాజరై స్నేహితులతో అడవిసోమన్ పల్లి బ్రిడ్జివద్ద నున్న మానేరు నది ప్రక్కన దవాత్ చేసుకుందామని వెళ్లినట్లుగా తెలిపారు. వాగులో మల, మూత్ర విషర్జనకు వెళ్లి కాలు జారీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లుగా తెలిపారు. ప్రమాదం సంఘటన స్థలాన్ని కొయ్యుర్ పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక క్వారీ గుంతలే ప్రమాదానికి కారణమా.? మండలంలోని వళ్లెంకుంట(అడవిసోమన్ పల్లి), మల్లారం ఇసుక క్వారీ నిర్వాహకులు ఓసిపిలను తలిపించేలా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్డుఅదుపు లేకుండా భారీగా గుంతలు తీయడంతో రాబోయే వర్షాకాలంలో పశువులు, మత్సకారుల, పశువుల కాపర్లు, ప్రజలు ప్రమాదాలకు గురైయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉస్మాన్ ఇసుక కోసం క్వారీ నిర్వహకులు తీసిన గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్వారీలపై ఇప్పటికైనా టిఎండిసి అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.