నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు గద్ధమైన ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
విహారి ట్రావెల్స్కు చెందిన ప్రయివేటు బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్నది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బస్సులో పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందికి దింపేశారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్దమైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



