ఎంచగూడెం గ్రామంలో విషాదం
నవతెలంగాణ-కొత్తగూడ
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎంచగూడెం గ్రామంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ప్రాణం కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంచగూడెంలో నర్సమ్మ- సారయ్య దంపతుల ఇంటికి దసరా పండుగకి కుమార్తె పిల్లలతో కలిసి వచ్చింది. ఈ క్రమంలో వారి బంధువు చనిపోవడంతో కుటుంబ సభ్యులు వేరే గ్రామానికి వెళ్లారు. ఇటుకాల నర్సయ్య-స్వాతి దంపతుల కొడుకు రితిక్(10), నర్సయ్య సోదరి అనిత కొడుకు జతిక్(9) ఇద్దరూ ఇంటి వద్ద ఉన్నారు.
ఇంటి పక్కనే ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన పిల్లలు ప్రమాదవశాత్తు అందులో పడిపోయి మృతిచెందారు. అయితే, పిల్లలు కనిపించకపోవడంతో పక్కింటి వారు వెతికారు. బావి వద్ద చెప్పులు, బట్టలు ఉండటాన్ని గమనించారు. బావిలో గాలించగా ముందుగా రితిక్ మృతదేహం లభ్యమైంది. గ్రామస్తుల సమాచారంతో కొత్తగూడ ఎస్ఐ రాజ్ కుమార్ సంఘటనా స్థలానికి వచ్చారు. గ్రామస్తుల సహాయంతో బావిలో మళ్లి వెతికి.. జతిన్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఇద్దరు పిల్లల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి..