బస్సు డ్రైవర్కు స్వల్పగాయాలు
విద్యార్థులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-వేములపల్లి
రెండు లారీలు స్కూల్ బస్సును ముందు, వెనుక భాగం నుంచి ఒకేసారి ఢీకొట్టడంతో డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఆదిత్య పాఠశాల బస్సు విద్యార్థులను తీసుకురావడానికి వెళ్తూ శెట్టిపాలెం క్రాస్ రోడ్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ వైపుకు వెళ్తున్న కంటైనర్ వెనుక నుంచి ఢీ కొట్టింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న లారీ కూడా బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టింది. ఏకకాలంలో బస్సు వెనుక, ముందు భాగాలను లారీలు ఢీకొట్టడంతో డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. స్థానికులు పోలీసుల సహాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.