విండీస్తో టీ20, జింబాబ్వేతో వన్డే పోరు
నవతెలంగాణ-ముంబయి : ఏడాదికి పైగా విరామం తర్వాత హైదరాబాద్లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ సందడి కనిపించనుంది. టీమ్ ఇండియా స్వదేశీ సీజన్లో ఓ టీ20, ఓ వన్డే మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. 2026-27 భారత్ స్వదేశీ సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో వెస్టిండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్న భారత్.. శ్రీలంకతో మూడేసి టీ20, వన్డేలు.. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్లో పోటీపడనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్లో భారత్ రెండు మ్యాచ్లు ఆడనుంది.
వెస్టిండీస్తో వన్డే సిరీస్ సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో ఆరంభం కానుండగా.. 30న గువహటిలో, అక్టోబర్ 3న చండీగడ్లో చివరి రెండు వన్డేలు జరుగుతాయి. కరీబియన్లతో ఐదు టీ20 సిరీస్ అక్టోబర్ 6న లక్నోలో షురూ కానుంది. 9న రాంచిలో, 11న ఇండోర్లో, 14న హైదరాబాద్లో, 17న బెంగళూరులో మిగతా మ్యాచ్లు జరుగుతాయి. శ్రీలంకతో వన్డే సిరీస్ డిసెంబర్ 13న ఢిల్లీలో మొదలు కానుంది. 16న బెంగళూరులో, 19న అహ్మదాబాద్లో చివరి రెండు మ్యాచ్లు షెడ్యూల్ చేశారు.
మూడు టీ20లు డిసెంబర్ 22న రాజ్కోట్లో, 24న కటక్లో, 27న పుణెలో ఉండనున్నాయి. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ జనవరి 3న కోల్కతాలో షురూ అవుతుంది. హైదరాబాద్లో 6న రెండో వన్డే, 9న ముంబయిలో ఆఖరు మ్యాచ్ జరుగనుంది. ఇక ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులకు నాగ్పూర్, చెన్నై, గువహటి, రాంచి, అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి టెస్టు జనవరి 21న ఆరంభం కానుండగా.. ఆఖరు టెస్టు ఫిబ్రవరి 27న అహ్మదాబాద్లో ఆరంభం కానుంది.



