Thursday, June 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరష్యాపై ఉక్రెయిన్‌ భారీ దాడి, పర్యవసానాలేమిటి?

రష్యాపై ఉక్రెయిన్‌ భారీ దాడి, పర్యవసానాలేమిటి?

- Advertisement -

నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభం అక్షరాలా పదకొండు వందల తొంభై ఆరవ రోజులో ప్రవేశించింది. ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియదు. ఆదివారం నాడు రష్యా గడ్డమీద ఆపరేషన్‌ స్పైడర్‌ వెబ్‌ (సాలెగూడు) పేరుతో ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్ల దాడిలో భారీ మొత్తంలో నష్టం చేకూర్చినట్లు జెలెన్‌స్కీ ప్రకటించాడు. దాన్ని ఉగ్రవాద చర్యగా వర్ణించిన రష్యా ప్రతిగా వెంటనే పెద్ద ఎత్తున దాడి చేసింది. ఉక్రెయిన్‌ చర్య మీద మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి అటు డోనాల్డ్‌ ట్రంప్‌ వైపు నుంచి ఇటు వ్లదిమిర్‌ పుతిన్‌ నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. దాడి గురించి ఉక్రెయిన్‌ తమకు ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వలేదనే ఒక్కమాట మాత్రమే అమెరికా అధ్యక్ష భవనం నుంచి వెలువడింది. సోమవారం నాడు టర్కీ నగరమైన ఇస్తాంబుల్‌లో రెండు దేశాల మధ్య యుద్ధ ఖైదీలు, మరణించిన వారి మృతదేహాల మార్పిడికి సంబంధించిన అవగాహన కుదిరింది. మూడు రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తామని రష్యా ప్రతిపాదిస్తే బేషరుతుగా అంగీకరించాలని ఉక్రెయిన్‌ చేసిన ప్రతిపాదనను పుతిన్‌ దూతలు తిరస్కరించారు.పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రెండు శిబిరాలూ తాజా పరిస్థితికి అనుగుణంగా ఎత్తుగడలను రూపొందించుకొనే కసరత్తులో ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. బందీల విడుదల గురించి గతంలోనే ఒక అవగాహన కుదిరి అమలు చేశారు, మరోసారి మిగిలిన వారి గురించి చర్చలలో పాల్గ్గొనటానికి ఇరువురికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. దానికి ఉక్రెయిన్‌ జరిపినదాడికీ సంబంధం లేదు. గడచిన మూడున్నరేం డ్లుగా రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు, ప్రతిదాడులూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం నాడు ఉక్రెయిన్‌ జరిపిన దాడికి ఉన్న ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయనవసరం లేదు. యుద్ధమన్న తర్వాత రెండు వైపులా నష్టం ఉంటుంది. మూడున్నరేండ్ల రష్యా మిలిటరీ చర్యలో ఉక్రెయిన్‌ ఇప్పటి వరకు కోల్పోయిన ప్రాంతం, ఇతర వాటితో పోల్చితే ఆది వారం నాటి రష్యా నష్టం పెద్దదేమీ కాదు.ఇక ఇస్తాంబుల్‌ చర్చల విషయానికి వస్తే జూన్‌ రెండవ తేదీన ఖైదీల మార్పిడి గురించి తప్ప శాంతి ప్రతిపాదనల మీద ఎలాంటి పురోగతీ లేదు. ఉక్రెయిన్‌ దాడిని అవకాశంగా తీసుకొని పశ్చిమ దేశాల పండితులు రష్యన్‌ సామర్ధ్యం గురించి కథనాలు వండి వారుస్తున్నారు, ప్రచారదాడికి పూనుకున్నారు.
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాతో సహా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ డ్రోన్లను ఎలా పంపింది. ఏక కాలంలో ఐదు వైమానిక స్థావరాల మీద ఎలా దాడి చేసింది అన్నది ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ పథకాన్ని రచించేందుకు తమకు పద్దెనిమిది నెలలు పట్టిందని జెలెన్‌స్కీ చెప్పుకున్నప్పటికీ పశ్చిమ దేశాలన్నింటి ఉమ్మడి హస్తం దీనివెనుక లేకుండా ఉక్రెయిన్‌కు అంతసీన్‌ లేదు. అంతర్గతంగా రష్యాలో కొందరు చేతులు కలిపిన కారణంగానే డ్రోన్ల రవాణా జరిగిందన్నది ప్రాధమిక సమాచారం. రష్యా పత్రిక మాస్కో టైమ్స్‌ కథనం సారాంశం ఇలా ఉంది. ఉక్రెయిన్‌ నగరాల మీద బాంబులు వేసేందుకు ఉపయోగించే 41టియు 95, టియు 22 బాంబర్లు, ఏ 50 అనే రాడార్‌ విమా నాన్ని ధ్వంస చేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పినదాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది. వీటిలో పదికంటే తక్కువే మిలిటరీ సర్వీసులో ఉన్నాయి.మరో రెండింటిని 2024లో ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులతో ఉక్రెయిన్‌ కూల్చివేసింది. మూడున్నర సంవత్సరాలలో ఇది రష్యాకు మూడవ పెద్ద దెబ్బ. ఈ రకం విమానాలను ఇప్పుడు రష్యా ఉత్పత్తి చేయటం లేదు. టియు 160 రకం బాంబర్లు గాక ఇవి ఒకే సారి 16క్షిపణులను రెండు వేల కిలోమీటర్ల దూరం మోసుకుపోగలవు. ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో అనేక విమానాలకు నిప్పంటుకున్నట్లు, ఆర్పివేసినట్లు, ఎలాంటి మరణాలు లేవని, అనుమానితులను అరెస్టు చేసినట్లు రష్యన్‌ రక్షణ మంత్రిత్వశాఖ నిర్ధారించింది. రష్యా వూహాత్మక బాంబర్లలో 34శాతాన్ని ధ్వంసం చేశామని వాటి నష్టం 7 బిలియన్‌ డాలర్లని ఉక్రెయిన్‌ భద్రతా సంస్థలు చెప్పాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా విశ్లేషించిన వారు మొత్తం 13 విమానాలు నాశనం లేదా దెబ్బతినట్లు చెప్పారు. ఎనిమిదని వాషింగ్టన్‌ డిసికి చెందిన నిపుణుడు క్రిస్‌ బిగ్గర్స్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు.మరోచోట ఐదు అని ఉక్రెయిన్‌ ఓకో హౌరా గ్రూపు విశ్లేషకులు పేర్కొన్నారు.
చెక్క పెట్టెల్లో117 డ్రోన్లను ఉంచి రష్యా ట్రక్కులలోనే రహస్యంగా తరలించామని, రిమోట్‌ కంట్రోలుతో చెక్క పెట్టెల మూతలను తొలగించి డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ పేర్కొన్నది. వైమానిక కేంద్రాల సమీపం నుంచి వాటిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెప్పింది.ఒక వైమానిక కేంద్రం ఉక్రెయిన్‌ నుంచి సైబీరియాలో 4,300 కిలోమీటర్లు, మరొకటి 1,900కి.మీ దూరంలో ఉంది. మూడు కేంద్రాల మీద జరిగిన దాడిని తిప్పికొట్టిన్లు పేర్కొన్నది. పర్యవసానాలు, రష్యన్‌ మిలిటరీ సామర్ద్యాన్ని అంచనా వేయటం ఈ దశలో కష్టం. ఇదీ మాస్కో టైమ్స్‌ మరుసటి రోజు విశ్లేషణ. ఉక్రెయిన్‌ దాడి మీద రష్యా ఎలా స్పందిస్తుందోనని ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది. అది అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఆధారపడి ఉంటుందన్నది ఒక తర్కం. తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే పరిష్కరిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఫారిన్‌ పోలిసీ అనే పత్రిక సిఐఏలో రష్యా గురించి విశ్లేషణ చేసిన మాజీ డైరెక్టర్‌ జార్జి బీబీతో మాట్లాడింది. పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకురావాల్సింది డోనాల్డ్‌ ట్రంప్‌ అని బీబీ చెప్పాడు. ఉక్రెయిన్‌ దాడి మీడియా ప్రత్యేకించి పశ్చిమదేశాల దృష్టిని పెద్దగా ఆకర్షించవచ్చు, రష్యా మీద పెద్ద ప్రభావం చూపుతుందని అనుకోవటం లేదు, దాని సామర్ద్యాన్ని దెబ్బతీయదని, రెండు దేశాల మధ్య పెద్ద మార్పులు తెస్తుందని అనుకోవటం లేదన్నాడు.
రష్యన్‌ మిలిటరీ వైమానిక, పెద్దడ్రోన్ల దాడిని ఎలా ఎదుర్కోవాలా అన్నదాని మీదే భద్రత గురించి దృష్టి సారించింది తప్ప భూమి మీద నుంచి డ్రోన్లను ప్రయోగించి దెబ్బతీసే ఎత్తుగడల గురించి కేంద్రీకరించలేదన్నది ప్రాథమికంగా కనిపిస్తున్నది.తక్కువ ఎత్తులో సమీపం నుంచి దాడి చేసే చిన్న డ్రోన్ల గురించి దృష్టి సారించలేదు. ఇది ఒక్క రష్యాకే కాదు యావత్‌ ప్రపంచానికి ఒక మిలిటరీ గుణపాఠం. ఎలాంటి అనుమానం కలగకుండా రష్యన్‌ డ్రైవర్లు వాటిని ట్రక్కులలో వైమానిక స్థావరాల వద్దకు తీసుకు వెళ్ల గలిగారు. మాస్కోలోని ప్రధాన గూఢచార కార్యాలయం సమీపం నుంచే స్పైడర్‌వెబ్‌ కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి రిమోట్‌ కంట్రోలతో పని చేయించారని చెబుతున్నారు, నిర్ధారించుకోవాల్సి ఉంది. ఈ దాడి కారణంగా రెండు దేశాల చర్చల క్రమంలో మార్పు రాదని మరుసటి రోజే జరిగిన సమావేశం వెల్లడించింది. అయితే దీనికి, ఎవరికి వారు వేసే ఎత్తుగడలకు సంబంధం ఉండదు. ఈ దాడి తర్వాత పుతిన్‌పై ట్రంప్‌ పట్టు పెరుగుతుందని కొందరు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రష్యాకు అనుకూలంగా పరిస్థితి ఉందని వేసిన అంచనాలను సవరించుకోవాలని సూచిస్తున్నారు. అందువలన రష్యా డిమాండ్‌ చేస్తున్న షరతులతో ఒప్పందానికి అంగీకరించే అవకాశం ఉండదని సూత్రీకరిస్తున్నారు. ఇంతకుముందే ఆ షరతులకు ట్రంప్‌ అంగీకరించలేదని, ఇప్పుడు మరింతగా వైఖరి గట్టిపడుతుందని అంటున్నారు. దాడికి ముందే గత కొద్ది రోజులుగా రష్యా మీద మరింత కఠిన వైఖరి తీసుకోవాలని, ఆంక్షల తీవ్రతను పెంచాలనే వత్తిడి ట్రంప్‌ మీద వస్తున్నది, ఐరోపా దేశాలు బహిరంగంగానే చెప్పాయి. పుతిన్‌ స్వయంగా కాల్పుల విరమణకు అంగీకరించకపోతే కొత్త ఆంక్షలను అమలు జరుపుతామనే సందేశాన్ని పంపగలడని విశ్లేషకులు చెబుతున్నారు. కొద్ది వారాల క్రితం ట్రంప్‌ తన ఓవల్‌ కార్యాలయంలో జెలెన్‌స్కీతో మాట్లాడుతూ ప్రయో గించటానికి తురుపుముక్కలేవీ లేవని చెప్పిన సంగతి తెలిసిందే. నాటో ప్రధాన కార్యాలయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ ఫిబ్రవరిలో మాట్లాడుతూ 2014కు ముందు కలిగి ఉన్న ప్రాంతాలన్నీ తిరిగి వస్తాయని ఉక్రెయిన్‌ భావించటం వాస్తవ విరుద్దమన్నాడు. ఇప్పుడు ధ్వంసం చేశామని చెబుతున్న ఫైటర్‌లు రష్యా దగ్గర ఉన్నవాటిలో ఒక చిన్న భాగమే.
రష్యా మిలిటరీ బలగంతో పోల్చితే ఉక్రెయిన్‌ ఏ మాత్రం పోల్చటానికి లేదు. అయినప్పటికీ మూడున్నరేండ్లుగా అది నిలిచి ఎదిరిస్తున్నది.కొందరు చెబుతున్నదాని ప్రకారం ఉక్రెయిన్‌ తన సమాచారం మొత్తాన్ని మైక్రోసాఫ్ట్‌కు తరలించింది. దాని క్లౌడ్‌ సేవలను ఉపయోగించుకుంది. పలు పశ్చిమ దేశాలు సమన్వయం చేసుకొని రష్యా మీద సైబర్‌దాడులు జరిపాయి. ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ కంపెనీ స్టార్‌లింక్‌ను అందచేసింది. ఇది ఉక్రెయిన్‌ సమాచార వ్యవస్థలను పటిష్టం కావించింది. మైక్రోసాఫ్ట్‌తో పాటు క్లౌడఫేర్‌, పాలన్‌టిర్‌ వంటి అనేక సంస్ధలు సైబర్‌దాడుల్లో ఉక్రెయిన్‌కు తోడ్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాతో సహా నాటో దేశాలన్నీ తమ సర్వశక్తులను ఉక్రెయిన్‌ మీద వడ్డి అనేక విధాలుగా సాయపడ్డాయి. వాటిలో ఆధునిక డ్రోన్ల ఉత్పత్తి ఒకటి.ఇది రష్యాకంటే ఆధునికమైన వాటిని ముందుగానే రూపొందించేందుకు తోడ్పడింది. గూఢచార సమాచారం, ఆధునిక ఆయుధాల అందచేత గురించి చెప్పనవసరం లేదు. ఒక చిన్న దేశం రష్యాను ఓడించిందనే ప్రచారదాడికి దాన్ని ఒక సాధనం చేసుకోవాలని చూశాయి. మరోవైపున ఆర్థికంగా ఆంక్షలతో ఎలా దెబ్బతీశాయో చెప్పనవసరం లేదు. ఇంత చేసినప్పటికీ వాటన్నింటినీ రష్యా అధిగమిస్తూ ఇప్పటి వరకు ఐదోవంతు ఉక్రెయిన్‌ భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. అనేక మౌలిక వ్యవస్థలను ధ్వంసం చేయగలిగింది.
నాటో దేశాలు ఉక్రెయిన్‌ను నిలిపేందుకు ఎంత చేసినా అవి సఫలం కాలేకపోతున్నాయి. ఆయుధాలిచ్చినా వాటిని వినియోగించే నైపుణ్యం ఉక్రెయిన్‌ మిలిటరీకి లేదని తేలింది. అంతే కాదు, అవసరమైన సంఖ్యలో సైనికుల సంఖ్య కూడా లేదు. రష్యాలో ఉన్న రక్షణ ఉత్పత్తుల మౌలిక వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది, రోజురోజుకూ రష్యాకు అనుకూలంగా పరిస్థితులు మారటంలో అది కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నది. అయితే తెల్లవారేసరికి రష్యా పైచేయి సాధిస్తుందని అర్ధం కాదు. పోరు దీర్ఘకాలం సాగినందున ఉక్రెయిన్‌కు లభించిన సాయాలన్నీ తాత్కాలికం తప్ప ముఖ్యంగా ఆయుధాలు శాశ్వతం కాదు. ముందే చెప్పుకున్నట్లు అనేక ప్రాంతాలు రష్యా స్వాధీనంలోకి వచ్చాయి. ఇది రష్యాకు అనుకూలతలను పెంచింది. మిలిటరీ జవాన్ల సంఖ్యలో రష్యాదే ఆధిపత్యం. అందువల్లనే దాని ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల మీద పట్టు నిలుపుకుంటోంది. ఉక్రెయిన్‌కు తగినన్ని బలగాలు లేని కారణంగా రష్యాలో ఆక్రమించుకున్న కురుస్కు ప్రాంతాన్ని అది నిలుపుకోలేకపోయింది. అనేక అనుభవాలను చూసిన తర్వాత పుతిన్‌ సేనలు వ్యూహాన్ని మార్చాయి. పశ్చిమ దేశాలు ఆశించినట్లు ఆంక్షలతో రష్యా కుదేలు కాలేదు.పోరు విషయంలో తటస్తంగా ఉన్నప్పటికీ భారత్‌, చైనా దాని నుంచి చమురు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసి ఒక విధంగా ఆర్థికంగా ఎంతగానో ఆదుకున్నాయి. అవి కూడా లబ్దిపొందాయి, ఇదొక కొత్త అనుభవం.
ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -