వృద్ధిరేటు 0.5 శాతానికి పతనం..షట్డౌన్ ప్రభావం
ఈ ఏడాది ఆర్థికవ్యవస్థపై నీలినీడలు
వాషింగ్టన్ : ప్రపంచానికి రారాజును అని పదే పదే చెప్పుకునే పెట్టుబడిదారి దేశం అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయింది. గతేడాది చివరలో చోటు చేసుకున్న 43 రోజుల ప్రభుత్వ షట్డౌన్ ప్రభావంతో అమెరికా జీడీపీ కుప్పకూలింది. 2025లో అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో వృద్ధి రేటు 0.5 శాతానికే పరిమితమైందని యూఎస్ వాణిజ్య శాఖ గురువారం వెల్లడించింది. గతంలో ప్రకటించిన అంచనాల కంటే ఇది చాలా తక్కువ కావడం విశేషం. గతేడాది జులై నుంచి సెప్టెంబర్ కాలంలో అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.4 శాతంగా, ఏప్రిల్- జూన్ మధ్య 3.8 శాతంగా నమోదయ్యింది. కాగా.. నాలుగో త్రైమాసికంలో ఒక్కసారిగా మందగించింది.
వాణిజ్య శాఖ అంతకుముందు వెల్లడించిన 0.7 శాతం అంచనాను ఇప్పుడు 0.5 శాతానికి తగ్గించింది. ఏడాదికేడాదితో పోల్చితే 2025 నాలుగో త్రైమాసికంలో షట్డౌన్ కారణంగా ఫెడరల్ ప్రభుత్వ వ్యయం, పెట్టుబడులు 16.6 శాతం పడిపోయాయి. ఇది వృద్ధిని 1.16 శాతం మేర దెబ్బతీసింది. వినియోగదారుల వ్యయం 1.9 శాతం పెరిగినప్పటికీ.. అది మునుపటి అంచనా రెండో త్రైమాసికంలోని 3.5 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉంది. 2025 పూర్తి సంవత్సరానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ 2.1 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుంది. ఇది 2024లోని 2.8 శాతం, 2023లోని 2.9 శాతం వృద్ధితో పోల్చితే తక్కువగా ఆర్థిక వ్యవస్థ గతేడాది మందగించిందని స్పష్టమవుతోంది.
ఈ ఏడాది పైనా నీలినీడలు..
గతేడాది 2025లో జీడీపీ భారీగా పడిపోగా.. ఈ ఏడాది వృద్ధి రేటుపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం, ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలగడంతో ఈ ఏడాది ఆర్థిక అంచనాలు అస్పష్టంగా ఉన్నాయి. గతేడాది అమెరికా ఉద్యోగ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది. 2002 తర్వాత మాంద్యం సమయం తర్వాత తొలిసారి 2025లో అత్యంత బలహీనమైన నియామకాలు నమోదుకావడం గమనార్హం.



