Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవీబీజీ రామ్‌జీ చట్టం రద్దుచేసేవరకు పోరాటం

వీబీజీ రామ్‌జీ చట్టం రద్దుచేసేవరకు పోరాటం

- Advertisement -

పాత చట్టాన్నే పునరుద్ధరించాలి : వ్యకాస అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్‌

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బీజేపీ మోడీ ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రామ్‌జీ కొత్త చట్టాన్ని రద్దుచేసి పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకు దేశవ్యాప్తంగా ఆందోళన, ప్రచారం నిర్వహిస్తామని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ అన్నారు. పేదల పొట్ట కొట్టి గ్రామీణ భూస్వాములు పెట్టుబడిదారుల జేబులు నింపడం కోసమే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భాగలింగంపల్లి సుందరయ్య పార్క్‌ వద్ద వీబీజీ రామ్‌జీ చట్టం కాఫీలను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు గ్రామీణ ఉపాధి హామీ చట్టం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 90 శాతం నిధులతో నడిచేది ప్రస్తుతం 60 శాతం నిధులు మాత్రమే ఇస్తారని గుర్తు చేశారు. మిగతా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని నిబంధనలు పెట్టారని చెప్పారు. ఆర్థికంగా దెబ్బ కొట్టి రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకోవాలనే కుట్ర దీనిలో దాగి ఉందని వ్యాఖ్యానించారు. 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిగ్గా నిధులను ఆపేస్తామంటూ మెళికపెట్టిందని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే నిధుల కొరతతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు ఇస్తారని గ్యారెంటీ లేదన్నారు. ఫలితంగా ఈ పనిని గ్రామీణ ప్రాంతంలో ఎత్తివేయాలని కుట్ర జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 125 రోజులు పని దినాలు పెంచినట్టే 60 రోజుల పనిని వ్యవసాయ సీజన్‌లో బందు పెట్టాలని కొత్త పథకం నిబంధనలు చెబుతున్నాయని వివరించారు. ఈ నిర్ణయం పని హక్కును దెబ్బతీస్తున్నదని విమర్శించారు. ఎలాంటి పనులు చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. ఇది ప్రజల భాగస్వామ్యాన్ని, గ్రామపంచాయతీల పాత్రను పూర్తిగా రద్దు చేశారని వివరించారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు బి ప్రసాద్‌, పొన్నం వెంకటేశ్వరరావు, నారి అయిలయ్య, కొండమడుగు నరసింహ , సాంబశివ , అన్నవరపు కనకయ్య, బొప్పని పద్మ, ములకలపల్లి రాములు , రాళ్లబండి శశిధర్‌ , కందుకూరి జగన్‌, ఎం వెంకటయ్య, నరసింహులు, గోపాల్‌, పెద్ది వెంకట్‌ రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -