12 రోజులు పోరాడి విజయం సాధించిన మహిళా కార్మికులు
ఎట్టకేలకు దిగొచ్చిన యాజమాన్యం
జేసీఎల్తో జరిగిన చర్చలు సక్సెస్
సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ ఏర్పాటు
అభినందించిన సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని షాహి పరిశ్రమలోని కార్మికులు విజయం సాధించారు. దాదాపు 12 వందల మంది మహిళా కార్మికులు 12 రోజులపాటు సమ్మె చేసి, తమ హక్కుల్ని సాధించుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలతో ఎట్టకేలకు దిగొచ్చిన కార్మికశాఖ, యాజ మాన్యం చర్చలకు అంగీకరించింది. తక్షణం కొన్ని సమస్యల పరిష్కారానికి అంగీకారం కుదిరింది. మరికొన్ని సమస్యల పరిష్కారానికి హైపవర్కమిటీ ఏర్పాటు చేసి, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరిస్తామని యాజ మాన్యం హామీ ఇచ్చింది. మహిళా కార్మికుల పోరాటానికి సీఐటీయూ అండగా నిలిచింది. పోరుబాట పట్టి విజయం సాధించిన కార్మికులకు జేజేలు పలికింది. 12 రోజులుగా 12వందల మంది కార్మికులు సమ్మె నిర్వహించారు.
దీంతో శుక్రవారం జేసీఎల్ ఆధ్వర్యం లో యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరిగాయి. ఎట్టకేలకు యాజమాన్యం దిగొచ్చి కార్మికులు లేవనెత్తిన కొన్ని సమస్యలు పరిష్కరించింది. 12రోజులుగా నిరవధికంగా పోరాడి హక్కులు సాధించుకున్న కార్మికులకు సీఐటీయూ రాష్ట్ర కమిటీ జేజేలు తెలిపింది. ఏడాదికి ఒకసారి ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందనీ, ఒకరోజు డుమ్మాకొడితే రూ. ఎనిమి దొందల కటింగ్ను తొలగించేందుకు అంగీకరించిందనీ, ఇన్సెంటివ్ను అందరికీ రూ. తొమ్మిదొందలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. హై లెవెల్ కమిటీ వచ్చాక మిగతా విషయాలు పరిష్కరించనున్నట్టు యాజమాన్యం అంగీకరించింది. కార్మికులపై వేధింపులు ఉండబోవనీ, ఈ అంశంపై కమిటీ వేస్తామనీ, అందులో కార్మికులకు కూడా అవకాశం కల్పించటానికి యాజమాన్యం అంగీకరించింది.. ఉద్యోగ భద్రతకు హామీ ఇచ్చారు.
12 రోజుల సమ్మె కాలానికి జీతాలు ఇవ్వాలని కార్మికుల డిమాండ్ చేసినందున ఆ విషయం హై లెవెల్ కమిటీ పరిధిలో ఉందని యాజమాన్యం తెలిపింది. అప్పటివరకు కార్మికులకు ఉన్న సెలవులు ఉపయోగించుకోవచ్చనీ, స్కిల్డ్, సెమీ స్కిల్, అన్ స్కిల్డ్, అని కేటగరేషన్ చేస్తామని యజమాన్యం ఒప్పుకున్నది. అంగీకరించిన అంశాలపై యజమాన్యం జేసీఎల్ ఆధ్వర్యంలో కార్మికుల సమక్షంలో సంతకాలు చేశారు. ఈ పోరాటంలో మహిళా కార్మికులు పట్టుదలతో పాల్గొన్నందుకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, ఉపాద్యక్షులు ఎస్వీ రమ, రాష్ట్ర కార్యదర్శులు పుప్పాల శ్రీకాంత్, కురపాటి రమేష్, మేడ్చేల్ జిల్లా కార్యదర్శి ఎ.అశోక్, నాయకులు పి.గణేష్, జి.శ్రీనివాస్, కోమటి రవి,బి.వి.సత్యనారయణ తదితరులు అభినందనలు తెలిపారు.



