మనిషి జీవితంలో చివరికి మిగిలేది ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం ‘శూన్యం’. శూన్యం అంటే ఏమీ లేదని అర్ధం. మనిషి మరణానంతరం ఏం జరుగుతుందో ఎవరికీ ఏమీ తెలియదు. చివరకు మిగిలేది ఏమీ లేదని తెలిసినా, మనిషికి డబ్బు కోసం ఎందుకింత వెంపర్లాట? పోయేటప్పుడు తనతో ఎవరూ రారని తెలిసినా ‘నా వాళ్లు’ అంటూ ఎందుకింత ఆరాటం? చితిమంటల కొలిమిలో తాను దహనమవుతున్నప్పుడు చుట్టూ ఏడుస్తున్న వారి రోదనలు కూడా వినిపించవని తెలిసిన మనిషికి ఎందుకింత గర్వం అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. ఈ విషయం అర్థం కావాలంటే, ఫిజిక్స్ అరుణ్ కుమార్ రాసిన కవితా సంపుటి ‘శూన్యం’ తప్పక చదవాల్సిందే.
అరుణ్ కుమార్ రచించిన ఈ కవితా సంపుటిలో ప్రతి కవిత సామాన్య పాఠకులకు అనురక్తి కలిగించే విధంగా వుంది. ప్రతి కవితలో మదుమధురమైన పదప్రయోగం అద్భుతం. పాఠకులను మంత్రముగ్ధులను చేసే సైన్స్ పదాలతో కవితలు రాయడం ఫిజిక్స్ అరుణ్ కుమార్కే సాధ్యం.
‘చరితకు నువ్వే ఓ ట్యాగ్ లైన్’ కవిత ద్వారా నేటి యువతకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. స్థాయీబేధం లేకుండా ఏ పోటీలోనైనా ‘గెలుపు, ఓటమి’ అనే రెండు పార్శ్వాలుంటాయి. విజయం సాధించాలంటే అందుకు ‘సాధన’ ఎంతో అవసరం. లక్ష్యం చేరుకోవాలంటే నిరంతర తపస్సులా సాధన చేస్తే గానీ విజయం సాధించలేం. ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, దిగలాగే ప్రయత్నాలు ఎదురవుతాయి. ‘ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యం మీద స్పష్టత, ప్రయత్నంలో అకుంఠిత దీక్ష, అనునిత్య సాధనే విజయానికి బాట వేస్తుందని, నీ గమ్యం చేరేవరకు ప్రయాణించు.. నువ్వే భవిష్యత్తు తరాలకు ఓ భానుడివి’ అంటాడు రచయిత.
‘నానమ్మ పెంచిన ప్రాణాలే’ కవిత ప్రతి పాఠకుడు చిన్ననాటి మధుర స్మతులను గుర్తు చేసుకునే విధంగా, తన బాల్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు. ”నా బాల్యపు స్మతులను నా బ్రెయిన్ మెమోరీ కార్డులో వెతకగా అసూయ, కోపం, స్వార్థం లేని పసిప్రాయం ఎంత బాగుందో..” అంటాడు. నిజానికి అరుణ్ చెప్పిన మాట అక్షర సత్యమే కదా!. కోపం, స్వార్ధం లేని చిన్ననాటి జ్ఞాపకాలతో మైమరిచి, చిలిపి పనులు గుర్తుచేసుకొని నవ్వుకోని వారు ఎవరుంటారు? ఎవరికైనా బాల్యం గొప్పదే. అంతేకాదు చంటి పిల్లలు అన్నం తినేందుకు మారాం చేస్తే ”చందమామ రావే’ అంటూ అమ్మ చందమామను చూపించగానే కడుపు నిండా భోజనం చేసినట్లు, చందమామ పాట ఎంతమధురమో! ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ.. మా తాత చెప్పిన కథ కూడా అంత మధురంగా ఉందని అంటాడు అరుణ్.
గురువు గొప్పతనం గురించి చాలామంది కవులు రాశారు కానీ గురువు ఆవేదనను అర్ధం చేసుకొనేలా, అందరినీ ఆకట్టుకునేలా ‘ప్రయివేటు టీచర్’ కవిత రూపంలో రాసిన ఏకైక కవి ఫిజిక్స్ అరుణ్ కుమార్. గురువు గొప్పతనం గురించి మేధావులంతా గురువంటే దేశ నిర్మాణానికి గుండెకాయ అని.. జాతీయ జెండా మతసామరస్యానికి ప్రాణం పోసే తరువే గురువని పొగుడుతున్నప్పుడు గురువు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అజ్ఞానంపై అక్షర సమరం చేస్తున్న గురువులను ప్రయివేటు టీచర్, ప్రభుత్వ టీచర్ అని రెండు పాయలుగా చీల్చడమే కాకుండా వారి జీతభత్యాలలో అత్యధిక వ్యత్యాసం చాలా బాధాకరమని కవిత రూపంలో ఎంతో అద్భుతంగా రాశారు. అంతేకాకుండా కరోనా వైరస్ కాలంపై చేసిన దాడిలో ప్రయివేటు పంతులు బతకడానికి బతుకుపై గెలవడానికి కూరగాయలు అమ్ముతూ, రియల్ స్టేట్ ఎంప్లారుగా ఇలా ఎన్నో పాత్రల చాటున చాలీచాలని జీతంతో బతుకు పోరాటాన్ని ఎంతో చక్కగా వర్ణించారు. అయినా సరే విద్యార్థులకు మాత్రం ఆశయ పాఠాలు చెబుతూ, వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని ప్రయివేటు టీచర్కు జరుగుతున్న అన్యాయంపై కవిత్వంతో పోరాటం చేస్తున్న కవి పోరాటం ఫలించాలని ఆశిద్దాం.
‘అమ్మ జాతీయ జెండాను ముద్దాడింది’ కవితలో దేశ రక్షణకు సైనికుడిగా వెళ్లిన కొడుకు కొన్నాళ్ల తరువాత మాంసపు ముద్దై వస్తే వారి తల్లిదండ్రులు పడే ఆవేదనని వర్ణించడం ఎవరికి సాధ్యం? కానీ అరుణ్ రాసిన కవిత చదివితే తల్లి మనోవేదన పాఠకుడికి కొంతైనా అర్ధం అవుతుంది. తిరిగి వస్తానని చెప్పి తల్లికి ఇచ్చిన మాట తప్పడమే కాకుండా తండ్రి దున్నే పొలంలో మట్టై మిగిలాడన్న వేదనలో కూడా ఆ తల్లి నా కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించిన మరో భగత్ సింగ్ అంటూ రోదిస్తున్న ఆ తల్లి కళ్ళలో వెలుగునే చూస్తున్నారు జనం అంటాడు అరుణ్. ప్రతి పాఠకుడు ఈ కవిత చదివిన తర్వాత సెల్యూట్ చేయాల్సిందే.
ఫిజిక్స్ అరుణ్ కుమార్ రాసిన 58 కవితల్లో ప్రతి కవిత దేనికది ప్రత్యేకమే. ప్రతి కవితను పాఠకుడు చివరిదాకా చదివి ఆనందించడంతో పాటు మధురానుభూతి చెందుతాడు. ప్రతి కవితలో చమత్కారమైన పద విన్యాసంతో పాఠకుడిని ఆకర్షించే నవరసాలు చొప్పించడం అరుణ్ కుమార్ రచనా నైపుణ్యానికి కలికితు రాయిగా నిలుస్తాయి. సమాజాభివద్ధికి ఉపయోగపడే మరిన్ని కవితలు అరుణ్ కుమార్ కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ ఆకాంక్ష.
– కోట దామోదర్, 9391480475
శూన్యం
- Advertisement -
- Advertisement -