– బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా చూడాలని తహసిల్దార్ గుడిమెల ప్రసాద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండలంలోని అన్ని గ్రామాల బూత్ లెవెల్ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసిల్దార్ బూత్ లెవల్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో బూత్ లెవల్ అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. తమకు అప్పగించిన విధులను బూత్ లెవెల్ అధికారులు నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు.
అనంతరం బూత్ లెవెల్ అధికారులకు ట్రైనర్స్ శేఖర్, ప్రభాకర్ లు టీవీలో ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారుల విధుల పట్ల అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో బూత్ లెవల్ అధికారుల పాత్ర, కొత్త ఓటర్ నమోదు, డిలేషన్ అఫ్ డూప్లికేట్ ఓటర్లు, ఓటర్లు లిస్ట్ ప్రత్యేక సంక్షిప్త సవరణ, మార్పులు చేర్పులు ఏవిధంగా చేయాలి, ఓటర్లతో ఏవిధంగా మాట్లాడాలి, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల రెవిన్యూ అధికారి శరత్, 38 పోలింగ్ కేంద్రాల బూత్ లెవల్ అధికారులు, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.