- Advertisement -
- – వంద రూపాయలు కూలి మాకా.. లక్షల జీతాలు మీకా..
– ఉపాధి కూలీల వేతనాలు రాక ఎన్ని రోజులు పస్తులుండాలి..
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ : ఎండలో మేము.. ఏసీలో మీరా.. వంద రూపాయల కూలి మాకా.. లక్షల జీతాలు మీకా.. ఉపాధి కూలీల వేతనాలు రాక పస్తులు ఎన్ని రోజులు ఉండాలి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామీణ ఉపాధి హామీ కూలీల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, కొత్త జాబ్ కార్డులను ఇవ్వాలని, ఉపాధి పనిని పట్టణ కూలీలకు పెట్టాలని, పని దినాలను 200 రోజులకు పెంచి రోజు కూలి రూ.600చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా నిధులను , పని దినాలను , కూలీల జాబ్ కార్డులను పెద్ద ఎత్తున కోత విధించిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి 15 కోట్ల పని దినాలు అవసరం ఉంటే ఇవ్వడం లేదని, పైగా గత సంవత్సరం 8 కోట్ల పని దినాలను ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 6:5 కోట్లకు తగ్గించిందని ఆరోపించారు. మరొకపక్క ఆధార్ కార్డు బ్యాంక్ ఎకౌంటు జాబ్ కార్డు నెంబరు లింకు పేరుతో దేశంలో 7.6 లక్షల కోట్ల జాబ్ కార్డులను తొలగించినట్లు పార్లమెంట్ లో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు.
ఉపాధి కూలీ వేతనం రూ.307 పెంచిన ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను తగ్గించిందని, గత సంవత్సరం రూ.90 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నా.. పాలకులు గత బడ్జెట్ లో రూ.86 లక్షల కోట్లకు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు 2.50 లక్షల కోట్లను ఉపాధి పనికి కేటాయించాలని డిమాండ్ చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాలను పట్టణాలలో విలీనం చేసి ఉపాధి పనిని ఎత్తివేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. కేరళ వామపక్ష ప్రభుత్వం మాదిరిగా పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి పనిని పెట్టాలని ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి పనిలో కొత్త విధానాలను అమలు చేస్తూ పేదలను పనికి దూరం చేస్తున్నదని అన్నారు. పని ప్రదేశంలో రెండు సార్లు ఫోటోలు దిగాలి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అనే నిబంధన పెట్టారు ఫోటోలు అప్లోడ్ కాకుంటే పనిచేసిన కూలీలను కూడా పనికిరాని కింద లెక్కబెడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఫోటో అప్లోడ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. జాబ్ కార్డుకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నంబర్లు లింకు పేరుతో అనేకమంది జాబ్ కార్డులను మోడీ ప్రభుత్వం తొలగిస్తుంది అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7.6 ఆరు కోట్ల జాబ్ కార్డులను తొలగించినట్లు పార్లమెంట్ లో బహిరంగ ప్రకటన చెప్పారు. తక్షణమే ఆధార్ బేస్ చెల్లింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కొత్త జాబ్ కార్డులను ఇవ్వకుండా దేశవ్యాప్తంగా వెబ్సైట్ ను లాక్ వేశారని దీని ఫలితంగా పని పొందే హక్కును జాబు కార్డును పొందే హక్కు కూలీలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఎప్పుడైనా జాబ్ కార్డు తీసుకుని విధంగా వెబ్ సైట్ ను ఓపెన్ పెట్టాలని కోరారు. గ్రామపంచాయతీలోనే జాబ్ కార్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనిచేసిన వారికి వారం రోజుల్లో వేతన బకాయిలు ఇవ్వాలని చట్టం డైరెక్షన్ ను ఎక్కడ అమలు చేయడం లేదన్నారు. పే స్లిప్పు ఇవ్వకపోవడం వలన ఎంత వేతనం పడిందో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఆన్లైన్ పేమెంట్ పేరు మీద బ్యాంకులో ఎప్పుడు డబ్బులు వేస్తారో తెలియని పరిస్థితికి కూలీలు నెట్టబడి పోయారని అన్నారు. తక్షణమే గతంలో మాదిరిగా మాన్యువల్ పేమెంట్ ను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలైన మంచినీళ్లు, మెడికల్ కిట్టు, టెంటు, పనిముట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్ లు అందుబాటులో ఉంచాలని కోరారు.
వడదెబ్బకు ఇతర కారణాలతో ఆరోగ్యం దెబ్బతిన్న వారికి ఎక్కడైనా ఉచిత వైద్యం చేయించుకోడానికి అవకాశం కల్పించాలని అన్నారు. పొరపాటున చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి చట్టాన్ని నీరుగార్చే అనేక చర్యలు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటుంటే రాష్ట్రంలో పేదల ఓట్లతో గెలిచిన బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు,కేంద్ర మంత్రులు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పేదల వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకునే విధంగా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే 150 రోజుల పని దినాలను రోజుకు రూ.400 కూలిని పట్టణ పేదలకు ఉపాధి పనిని కల్పిస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు. సీనియర్ మెట్లు గా ఉన్న వారిని కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో, ఫీల్డ్ అసిస్టెంట్ లేని దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించాలని అన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ జంపాల స్వరాజ్యం, జిల్లా నాయకులు సోమపంగా జానయ్య, నల్ల మేకల అంజయ్య, షేక్ సైదా హుస్సేన్, మిట్టపల్లి లక్ష్మి, ఆరే రామకృష్ణారెడ్డి, గుంజ వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు మేకనబోయిన శేఖర్, వల్లపు దాసు సాయికుమార్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్, నాయకులు కిన్నెర వెంకన్న, బుడిగే ధనుంజయ్ గౌడ్, సిరికొండ చిన్న శ్రీనివాస్, రాచకొండ సైదులు, మేరెడ్డి కృష్ణారెడ్డి, మామిడి సుందరయ్య, శిగా శ్రీనివాస్, బోడపట్ల హుస్సేన్, వీరబోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -