– సరస్వతీ పుష్కరాలు విజయవంతం
– సంవత్సరం పాటు పుష్కర స్నానానికి అవకాశం
– భాగస్వాములైన అందరికీ అభినందనలు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
నవతెలంగాణ-భూపాలపల్లి
సరస్వతీ పుష్కరాలను ఛాలెంజ్గా తీసుకుని నిర్వహించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సోమవారం సాయంత్రం జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ ఘాట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు జరిగిన పుష్కరాలకు ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించారని అభినందించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. రూ.40కోట్లతో పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎన్నికల నిబంధనల వల్ల పనులు చేపట్టేందుకు కొద్దిగా ఇబ్బంది కలిగినా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం తక్కువ సమయంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు చేసిన పుష్కరాలు దిగ్విజయం అయ్యాయని తెలిపారు. గోదావరి, ప్రాణహిత, అంతరవాహిని సరస్వతి సంగమంలో మొట్ట మొదటిసారిగా పుష్కరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సరస్వతీ మాతా 17 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. దాదాపు 30 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని అన్నారు. ఈ ప్రాంతానికి అన్ని లక్షల మంది ఎన్నడూ రాలేదని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా జరుపుతామని అన్నారు. కాశీ పండితులు. ప్రతి రోజూ సరస్వతి నవరత్న మాలా కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. మీడియా ద్వారా లక్షలాది. మంది భక్తులు వచ్చేలా ప్రచారం చేశారని, టీవీ ఛానళ్ల ద్వారా వీక్షించే అవకాశం కల్పించారని అభినందించారు. పుణ్య స్నానాలు సంవత్సరం పాటు చేసేందుకు అవకాశం ఉందని, రాలేని భక్తులు సంవత్సర కాలంలో ఎపుడైనా పుష్కర స్నానాలు చేయొచ్చని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేక చొరవతో ముందస్తు చర్యలు తీసుకోవడంతో సరస్వతీ పుష్కరాలు విజయవంతానికి కృషి చేశారని అభినందించారు. రానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వత సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.
దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం చిన్న గ్రామమని అన్నారు. ఈ గ్రామంలో ఇంత గొప్ప మహా సరస్వతీ పుష్కరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. 5 నెలల ముందు నుంచి ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రభుత్వం రూ.40కోట్లు మంజూరు చేయడంతో అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. అనంతరం సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం వీక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ నాగఫణి శర్మ, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మదన్ మోహన్, మక్కన్ సింగ్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మెన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు.
ఛాలెంజ్గా తీసుకుని నిర్వహించాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES