Friday, June 27, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్డ్రగ్స్‌కు అడ్డాగా మారిస్తే సహించం

డ్రగ్స్‌కు అడ్డాగా మారిస్తే సహించం

- Advertisement -

మత్తు జోలికెళ్తే వెన్నులో వణుకు పుట్టాలి
ఆనవాళ్లు దొరికితే విద్యాసంస్థలపైనా కేసులు
యువతరం జీవితాలను నాశనం చేసుకోవద్దు
గంజాయిని అరికట్టేందుకు ఈగల్‌ సంస్థ ఏర్పాటు : మాదక ద్రవ్యాల నియంత్రణ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉద్యమాల గడ్డను డ్రగ్స్‌కు అడ్డాగా మారిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మత్తు జోలికి వెళ్తే, వెన్నులో వణుకు పుట్టేలా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పకళా వేదికలో గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం ప్రసంగించారు. ”కొమరం భీం జల్‌, జంగిల్‌, జమీన్‌ కోసం పోరాడారు. ఆ తర్వాత చాకలి ఐలమ్మ తదితరులు భూమి కోసం భుక్తి కోసం ఉద్యమించారు. వారి పోరాట స్ఫూర్తితో స్వరాష్ట్రం సాధించే వరకు విశ్రమించలేదు. అలాంటి నేలపై డ్రగ్స్‌ ప్రభావం పడింది” అని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు విద్యార్థుల రోజువారి ప్రవర్తనపై నిఘా పెట్టాలని సూచించారు. ”చదువు కోసం టీచర్లను నియమించిన విధంగా సైకాలజీ టీచర్లనూ పెట్టుకోవాలి. విద్యార్థులను గమనించి దారిలో పెట్టాలి. యాజమాన్యం, టీచర్లకు కూడా సామాజిక బాధ్యత ఉంది. విద్యాసంస్థల్లో ఓరియంటేషన్‌ క్లాస్‌లు ఏర్పాటు చేయాలి. విద్యాసంస్థల ఆవరణలో డ్రగ్స్‌ వాడుతూ దొరికితే ఆ యాజమాన్యాలపై కూడా కేసులు పెడతాం” అని హెచ్చరించారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైతే దేశ మనుగడకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ”ఒక దేశాన్ని దెబ్బతీయడానికి శత్రుదేశాలు ఏ మార్గాన్ని ఎంచుకుంటాయో చెప్పలేం.కానీ మాదక ద్రవ్యాలు తరలించే వారు తెలంగాణ సరిహద్దుల్లో అడుగు పెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించేలా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం” అని చెప్పారు. ”యుద్ధం, సైనికులు అంటే.. ఒకప్పుడు పంజాబ్‌ గుర్తుకొచ్చేది. అలాంటి రాష్ట్రం ప్రస్తుతం మత్తు పదార్థాల వలలో చిక్కుకుంది. ఆ పరిస్థితి మన రాష్ట్రానికి రాకూడదు. డ్రగ్స్‌ నివారణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలి. ఐటీ, ఫార్మా హబ్‌గా ఉండాలే తప్ప గంజాయి హబ్‌గా మారకూడదు. యువతను సరైన మార్గంలో పెట్టాలి” అని అన్నారు. యువతను అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు స్పోర్ట్స్‌ పాలసీ తీసుకొచ్చామనీ, 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్స్‌లో ఒక్క బంగారు పతకం రాకపోవటం గురించి ఆలోచించి, ప్రపంచం మెచ్చేలా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పివి.సిందూ, నిఖిత్‌ జరీనా, దీప్తి మొదలగు క్రీడాకారులకు ప్రభుత్వం ఉన్నత స్థాయి ఉద్యోగాలిచ్చి గౌరవించిందనీ, యువతకు సాంకేతిక నైపుణ్యం అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. క్రీడలతో పాటు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు 2040 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామనీ, పదేండ్లలో ఒక ట్రిలియన్‌, 20 ఏండ్లలో 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు. చాక్లెట్లు, ఐస్‌క్రీముల్లో గంజాయి, డ్రగ్స్‌ కలిపి విక్రయిస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌, గంజాయి నివారణకు ప్రత్యేకంగా ‘ఈగల్‌’ అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గంజాయి పంట, సరఫరా, విక్రయంపై ఈగల్‌ టీమ్‌ ప్రత్యేక నిఘా పెడుతుందన్నారు. సినీ హీరోలు రామ్‌చరణ్‌తేజ, విజరు దేవరకొండ, పుల్లెల గోపిచంద్‌ లాంటి వారు ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని అభినందించారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా పట్టుదల, కఠోర శ్రమతోనే సినీ రంగంలో లెజెండరీగా చిరంజీవి గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఆయన ఏ రోజూ వ్యసనాలకు బానిస కాలేదని అన్నారు. సినిమాల్లో పోషించిన పాత్రలు పాజిటివ్‌గా ఉన్నా, నెగెటివ్‌గా ఉన్నా వారి నిజజీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం యువతకు పిలుపునిచ్చారు. అంతకు ముందు డ్రగ్స్‌ మహమ్మారి వల్ల జరిగే అనర్థాలపై సురేశ్‌పాణి రూపొందించి షార్ట్‌ ఫిల్మ్‌తో పాటు నల్లగొండ గద్దర్‌ పాడిన పాటను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అవిష్కరించారు.
హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ, ‘దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం అవసరం లేదు. యువతకు డ్రగ్స్‌ అలవాటు చేస్తే చాలు. డ్రగ్స్‌ మన జీవితాల్సి నాశనం చేస్తాయి. వీటికి దూరంగా మనమంతా ఆరోగ్యంగా ఉండాలి. వ్యాయాయం చేయాలి’ అని అన్నారు.
‘గతంలో కొన్ని స్కూల్స్‌ బయట డ్రగ్స్‌ అమ్ముతున్నారని తెలిసి చాలా బాధేసింది. అప్పుడు నేను తండ్రిని కాదు. ఇప్పుడు నేనూ ఒక తండ్రిని. డ్రగ్స్‌ నివారణను మన కుటుంబంతో మొదలు పెట్టి స్కూల్‌, సమాజాన్ని బాగు చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారదం.. డ్రగ్స్‌ని నిర్మూలిద్దాం’ అని హీరో రామ్‌చరణ్‌ అన్నారు.
ఎఫ్‌డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, ‘మలయాళ చిత్ర పరిశ్రమలో మాదిరిగానే ఇక్కడ కూడా ఎవరైన డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్థారణ అయితే ఇండిస్టీ నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే సమాజానికి సందేశం వెళ్తుంది. దీనిపై సినీ పెద్దలతో చర్చిస్తాను’ అని తెలిపారు.
అనంతరం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తీసిన మూడు షార్ట్‌పిల్మ్‌లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కొండా విశ్వేశర్‌రెడ్డి, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ దిల్‌రాజు, ప్రముఖ సినీ నటులు రామ్‌చరణ్‌తేజ, విజయ దేవరకొండ, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, డీజీపీ జితెందర్‌, టీజీ న్యాబ్‌ డీజీ.సందిప్‌శాండిల్య తదితరులు పాల్గొన్నారు.
కొమరం భీం జల్‌, జంగిల్‌, జమీన్‌ కోసం పోరాడారు ఆ తర్వాత చాకలి ఐలమ్మ తదితరులు భూమి కోసం భుక్తి కోసం ఉద్యమించారు. వారి పోరాట స్ఫూర్తితో స్వరాష్ట్రం సాధించే వరకు విశ్రమించలేదు. అలాంటి నేలపై డ్రగ్స్‌ ప్రభావం పడింది

– ముఖ్యమంత్రి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -