సుప్రీం వ్యాఖ్యలపై ఏఐకేఎస్ విచారం
న్యూఢిల్లీ : పొలాల్లో పంట వ్యర్ధాలను తగలబెట్టే రైతులను అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు బుధవారం చేసిన వ్యాఖ్యల పట్ల అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అనూహ్యంగా సంభవించిన వరదల తాకిడికి గురై నష్టపోయిన రైతాంగం పట్ల సున్నితంగా వ్యవహరించకుండా అనుచితంగా ప్రవర్తించడం గా ఈ చర్యను ఏఐకేఎస్ భావిస్తోందని పేర్కొంది. వరి పంటలో గణనీయమైన భాగం ఇప్పటికే నీట మునిగి వుందని, అందువల్ల ఈసారి పొలాల్లో వ్యర్ధాలను తగలబెట్టేందుకు ఎలాంటి అవకాశం లేదని ఆయా రాష్ట్రాల న్యాయవాదులు సుప్రీం కోర్టుకు తెలియచేయాలని పేర్కొంది. రైతులకు జరిమానాలు విధించడం లేదా అరెస్టు చేయడం వంటి శిక్షాత్మక చర్యలు తీసుకోవడానికి బదులుగా పంట కోతలకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వాలు అభివృద్ధి పరచాల్సిన అత్యవసర పరిస్థితి వుందని రైతు సంఘాలు నొక్కి చెబుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా రబీ పంటకు విత్తనాలు వేసుకోవడానికి వీలుగా రైతులు తమ పంట పొలాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం వుందని అర్ధం చేసుకోవాలని కోరింది.
పొలాల్లోని పంట వ్యర్ధాలను ప్రత్యామ్నాయ పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగించే సాంకేతికతను గతంలో రూపొం దించారని, కానీ ఆయా ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం కొరవడడం వల్ల అమల్లోకి రాలేదని ఏఐకేఎస్ పేర్కొంది. పర్యావరణ కాలుష్యానికి ఇదొక్కటే కారణం కాదని ఎఐకెఎస్ పునరుద్ఘాటించింది. పరిశ్రమలు, రవాణా, బాణాసంచా, నిర్మాణ కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఇతోధికంగా దోహదపడుతున్నా యని పేర్కొంది. భవిష్యత్తులో ఇలా పంట వ్యర్ధాలను తగలబెట్టడాన్ని నేరంగా పరిగణించ బోమని 2021 డిసెంబరులో ఎస్కెఎంకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవాలని కోరింది. వరదల కారణంగా ప్రజల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా పశువులు, పంటలను కూడా తీవ్రంగా నష్టపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను నేరస్తు లుగా చిత్రీకరిస్తూ వారిని అరెస్టులు చేస్తామనే బెది రింపులు జారీ చేయడం కన్నా వారెదుర్కొంటున్న ఇబ్బందులను పంచుకోవాలని ఏఐకేఎస్ కోరు తోంది. పర్యావరణ కాలుష్యం పట్ల సమగ్ర దృక్పథంతో వ్యవహరించాలని, పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరింది.