నిజమైన రాచరికం అంటే కోటలో ఉండటం కాదు ప్రజల గుండెల్లో ఉండటమే అని నమ్మారు ఆమె. అందుకే రాజభవనాల ద్వారాలను తెరిచి అక్కడ మహిళలకు కావాల్సిన నైపుణ్యాలను అందిస్తూ వారి ఆర్థికస్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్నారు. దీని కోసం ప్రిన్స్ దియాకుమారి ఫౌండేషన్ (పీడీకేఎఫ్) ఏర్పాటు చేసి మహిళల కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఫ్యాషన్ రాజధాని ప్యారిస్కే కాదు… లండన్, ఆస్ట్రేలియాలకు సైతం పీడీకేఎఫ్ ఇప్పుడు తమ ఫ్యాషన్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. పేద మహిళల ఆర్థికసాధికారతే లక్ష్యంగా సాగుతున్న ఈ సంస్థ జైపుర్లోని సిటీప్యాలెస్లో ఉన్న బాదల్మహల్లో నడుస్తోంది. దీన్ని ప్రారంభించినది దియాకుమారి. ఈమె జైపుర్ రాజమాత గాయత్రీదేవి మనవరాలు. ఆమె పరిచయం నేటి మానవిలో…
దియా.. మహారాజ్ సవాయి భవానీసింగ్ ఒక్కగానొక్క కూతురు. వారసత్వంగా కీలక బాధ్యతలనే ఆమె భుజానికెత్తుకున్నారు. అలనాటి రాజభవనాల నిర్వహణతోపాటూ ట్రస్టులూ, స్కూళ్లనీ ఆమే పర్యవేక్షిస్తున్నారు. అందరూ ‘రాజకుమారి’ అని ఆప్యాయంగా పిలుచుకునే దియాకు ఖరీదైన చీరలకన్నా రాజస్థానీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే లెహేరియా చీరలు ధరించడం అంటేనే ఇష్టం. అది కూడా పేదమహిళలకు అండగా ఉండే సంస్థల నుంచే వాటిని కొనుగోలు చేస్తుంటారామె.
అంతర్జాతీయ సంస్థలకు…
దియా తాను అనుకున్న లక్ష్యం నెరవేరేందుకు పర్యాటకులు జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే బాదల్మహల్నీ అంటే తన నివాసాన్నే ఇందుకు వేదికగా చేసుకున్నారు. మహిళలకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీలలో శిక్షణ ఇచ్చి వాళ్లచేత రాజస్థానీ సంస్కృతి ప్రతిబింబించే కీచెయిన్లు, కోస్టర్లు, ఫ్యాబ్రిక్ నెక్లెస్లు, జర్దోసీ, గోటాపట్టీ పనితనంతో చేసిన చీరలు, లెహేరియా చీరలను ఇక్కడ తయారుచేయిస్తుంటారు. వీటిని అమ్మడానికి బాదల్మహల్ల్లోనే దుకాణాన్నీ ఏర్పాటు చేశారు. దియా చొరవతో ఈ ఉత్పత్తులకు ప్రపంచస్థాయి మార్కెట్ ఏర్పడింది. వీరి పనితనాన్ని మెచ్చి ప్యారిస్లోని చాటెల్లేస్ లగ్జరీ షూ బ్రాండ్, వియాన్నాకు చెందిన అంతర్జాతీయ ట్రావెల్ బ్యాగ్స్ తయారీ సంస్థ… వినియోగదారులుగా మారిపోయాయి. గతేడాది మిస్ ఇండియా సుమన్రావు కూడా ఈ సంస్థ డిజైన్ చేసిన దుస్తుల్నే ప్రపంచ సుందరి పోటీల్లో ధరించడం విశేషం. కళలమీద ఇష్టంతో లండన్లో డెకరేటివ్ఆర్ట్స్లో డిగ్రీ చేసిన దియాకి ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. అమ్మాయి గౌరవి. న్యూయార్క్లో ఫ్యాషన్డిజైనింగ్ చదివి ప్రస్తుతం పీడీకేఎఫ్తోనే కలసి పనిచేస్తుంది.
పర్యాటకులకు ఆతిథ్యం…
జైపుర్ అంటే కేవలం కోటలూ, భవనాలేనా? ఇక్కడ తినే ఆహారం, ప్రజల ఇళ్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అనుకూలంగా మలుచుకుని మహిళలకు పర్యాటకం ద్వారా మరింత ఆదాయం వచ్చేలా చేశారు. ఎయిర్బీఎన్బీ అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని సాయంతో… పీడీకేఎఫ్లోని సభ్యులు తమ ఇంటికి పర్యాటకులను ఆహ్వానించవచ్చు. తమకొచ్చిన వంటకాలు, కళలని పరిచయం చేసి ఆదాయం పొందవచ్చు. వీటితోపాటు, బాలికలకు ఉపయోగపడేలా ‘శిక్షా దియా’ అనే ప్రాజెక్టునీ ప్రారంభించారు ఆమె. ఈ ప్రాజెక్టు కింద ఆడపిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. ఈ సేవలకుగాను రాజస్థాన్ రాష్ట్రానికి ‘సేవ్గర్ల్చైల్డ్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారామె. ‘సామాన్యులకంటే నువ్వేమీ ఎక్కువ కాదు… అని నాన్న చెప్పిన మాటలు నాకు పదేపదే గుర్తొస్తాయి. అందువల్లే పేదప్రజల ఇళ్లలోకి వెళ్లడానికి, వాళ్లింట్లో తినడానికి నాకేమాత్రం చిన్నతనంగా ఉండదు’ అంటూ ఆమె ఓ వెబ్సైట్తో పంచుకున్నారు.
మహమ్మారి సమయంలో…
కరోనా సమయంలో ప్రజలకు చేయూత అందించేందుకు జశీAఱస అనే కమ్యూనిటీ హెల్త్ ఇనిషియేటివ్ను కోవిడ్ పాజిటివ్ రోగుల కుటుంబాలకు భోజన కిట్లు, బాధిత, అవసరమైన వారికి వైద్య సామాగ్రి, నిత్యావసరాలను పంపిణీ చేశారు. వ్యక్తులు, సంస్థలు తమతో చేతులు కలపాలని, తాము చేసే కార్యక్రమాలకు వీలైన విధంగా మద్దతు ఇవ్వాలని నేను ఆమె స్వాగతిస్తున్నారు. అందరూ కలిసి పని చేయడం ద్వారా సమాజంలో మార్పును త్వరగా తీసుకురావచ్చని ఆమె నమ్ముతున్నారు.
వర్చువల్ మ్యూజియం…
అణువణువూ రాజసం ఉట్టిపడే రాజభవనాలని ఒక్కసారైనా చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండీ! అందుకే దియా కూడా అలనాటి చారిత్రక వైభవాన్ని ప్రజలకు చేరువ చేయాలనుకున్నారు. ఇందుకోసం రాజ కుటుంబాలు ఉపయోగించిన వస్తువుల్నీ ప్రజలు చూడ్డానికి వీలుగా రాజభవనాలనే మ్యూజియాలుగా తీర్చిదిద్దారు. అలనాటి రాణులు ఉపయోగించిన వస్తువులూ, ఆభరణాలూ, పల్లకీలను ఇక్కడ చూడొచ్చు. జైపుర్కి వచ్చినవాళ్లు మాత్రమే కాకుండా అందరికీ భారతీయ సంస్కృతి గొప్పదనం తెలిసేలా వర్చువల్ గ్యాలరీలను ఏర్పాటుచేశారు. సిటీ ప్యాలెస్, జైఘర్ఫోర్ట్, మహారాజా సవాయిమాన్సింగ్-2 మ్యూజియం ట్రస్ట్, జైఘర్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్లతోపాటూ మరోమూడు ప్యాలెస్ హోటల్స్ని ఆమే నిర్వహిస్తున్నారు.
సమిష్టి కృషితోనే…
రాజస్థాన్ అంటేనే మహిళలు, సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటుంటారు. చిన్న వయసులోనే పెండ్లి చేసుకొని విద్యకు దూరమవుతుంటారు. అటువంటి మహిళల జీవితాలను మెరుగుపచడానికి సమిష్టి కృషి అవసరమని దియా భావించారు. పేదరికంలో మగ్గుతున్న రాజస్థాన్ మహిళలను ఆర్థికంగా ముందుకు నడిపించాలన్న లక్ష్యంతో ఎనిమిదేండ్ల కిందట పీడీకేఎఫ్ని ప్రారంభించారు ఆమె. దీని ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలకు వివిధ ఆదాయ ఉత్పత్తి నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం, స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడం, వారిని వివిధ ప్రభుత్వ పథకాలకు అనుసందానించడం ద్వారా సామాజిక వ్యవస్థాపకతకు బీజాలు వేస్తున్నారు. బాలికలకు విద్యను ప్రోత్సహిస్తున్నారు. మహిళలకు వ్యవసాయ జ్ఞానాన్ని, జీవనోపాధిని సృష్టించడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంలో కృషి చేస్తున్నారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా…
- Advertisement -
- Advertisement -