నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గోవింద్ తన సిబ్బంది ఆధ్వర్యంలో గంజాయికి అలవాటు పడిన యువతకు తల్లిదండ్రుల సమక్షంలో టాస్క్ ఫోర్స్ ఆఫీస్ యందు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు, యువత గంజాయి ఇతర నిషేధిత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
విద్యార్థులు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులలో ఎవరైనా మత్తు పదార్థాలకు బానిస అయినట్లయితే వారిని డి అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి మత్తు పదార్థాలను మానిపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. గంజాయి మరియు ఇతర నిషేధితమత్తు పదార్థాలు పెంచిన, స్వీకరించిన, రవాణా చేసిన వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. మాదక ద్రవ్యాలను అరికట్టడం లో ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని సూచించారు. గంజాయికి బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకొంటుందని దాని వలన వారి జీవితాలు విచ్చిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురైవుతున్నారని, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరు స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని, గంజాయి రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు.