నవతెలంగాణ – జుక్కల్
సాంగ్లీ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా వేగవంతమైంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలోని ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాలకు ఏఐసీసీ అబ్జర్వర్గా వ్యవహరిస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారు హాజరై, డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను స్వయంగా సేకరించారు. పార్టీ బలోపేతానికి ప్రతి వర్గం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ ప్రక్రియను పారదర్శకంగా కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు కూడా పాల్గొని, సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా పార్టీ నిర్మాణం మరింత బలపడుతుందని తెలిపారు. క్రమబద్ధమైన విధానంలో నాయకత్వాన్ని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్లో మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జిల్లా స్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, రాబోయే ఎన్నికల దృష్ట్యా సమర్థ నాయకత్వాన్ని ఎంపిక చేయడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని నాయకులు స్పష్టం చేశారు.



